
హనుమకొండ, వెలుగు: రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్- 2047 విజన్ తో ముందుకెళ్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండ పోలీస్పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సంబురాలకు మంత్రి కొండా సురేఖ చీఫ్ గెస్ట్ హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ ఫ్రా డెవలప్ మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు అందులో ప్రాధన్యమిచ్చినట్లు తెలిపారు.
ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరంగా హనుమకొండ జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును మంత్రి చదివి వినిపించారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబ సభ్యులను మంత్రి కొండా సురేఖ సన్మానించారు. పలువురు పోలీస్ ఆఫీసర్లు, సిబ్బందికి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా సేవా పతాకాలను అందజేశారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు. అంతకుమందు అదాలత్ జంక్షన్ లోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి, ఎమ్మెల్యే నాయిని తదితరులు నివాళులర్పించారు.