హైదరాబాద్, వెలుగు: తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ టైటిల్ను కైవసం చేసుకుంది. మొత్తం 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిది పాయింట్లతో ఇండియన్ ప్లేయర్ టాప్లో నిలిచింది. రష్యాలోని స్కొలొవో లో.. గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ (చైనా)తో ఆదివారం జరిగిన ఆఖరిదైన 11వ రౌండ్ను హంపి 35 ఎత్తుల వద్ద డ్రాగా ముగించింది. దీంతో ఇరువురికి చెరో అర పాయింట్ లభించింది. ఫైనల్ రౌండ్కు ముందు వరుసగా నాలుగు గేమ్లు గెలవడం హంపికి కలిసొచ్చింది. ఆఖరి రౌండ్లో తెల్ల పావులతో ఆడిన తెలుగమ్మాయి అద్భుతమైన వ్యూహాలతో ప్రపంచ చాంపియన్ జు వెంజున్ను కట్టడి చేసింది. ఏడున్నర పాయింట్లతో జు వెంజున్ రెండో స్థానంలో నిలిచింది. ఇండియా మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. లాగ్నో కాటెరైనా (రష్యా)తో జరిగిన గేమ్ను 30 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. దీంతో హారిక 5 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. నాలుగు టోర్నీల సిరీస్గా జరిగే ఈ గ్రాండ్ప్రిలో టాప్–2లో నిలిచిన ఇద్దరు ప్లేయర్లు క్యాండిడేట్స్ మ్యాచ్కు అర్హత సాధిస్తారు. గ్రాండ్ప్రిలో మిగతా మూడు టోర్నీలు మొనాకో (డిసెంబర్ 2 నుంచి 15 వరకు), లుసానే (మార్చి 1 నుంచి 14 వరకు), సార్డినియా (మే 2 నుంచి 15 వరకు)లో జరుగుతాయి.

