బీఆర్ఎస్​కు మళ్లీ అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తది : కూన శ్రీశైలం గౌడ్

బీఆర్ఎస్​కు మళ్లీ అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తది : కూన శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తదని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. గురువారం బీజేపీ ఎంపీ, సినీనటుడు రవికిశోర్​తో కలిసి కుత్బుల్లాపూర్​లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్​దేనన్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని వారు చెప్పే పథకాలకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. 

డబుల్ ఇంజన్ సర్కారుతోనేతెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం సూరారం రాంలీలా మైదానంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. నయా నిజాం కేసీఆర్​ నిరంకుశ పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్​, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ఓబీసీ నాయకుడు నందనం దివాకర్​తదితరులు పాల్గొన్నారు.