న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.2,038 కోట్ల లాభం సంపాదించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంతో క్యూ4తో పోలిస్తే లాభం 14 శాతం పెరిగింది. అప్పుడు రూ.1,789 కోట్ల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.10,874కోట్ల నుంచి రూ.13,823 కోట్లకు పెరిగింది. నికర ఆదాయం కన్సా లిడేటెడ్ ప్రాతిపదికన రూ.6,201 కోట్ల నుంచి రూ.7,204 కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం రూ.38,723 కోట్ల నుంచి రూ.45,903 కోట్లకు చేరింది. స్థూల మొండి బకాయిలు,నిరర్ధక ఆస్తులు అతిస్వల్పంగా 1.95 శాతం నుంచి రూ.1.94 శాతానికి తగ్గాయి. నికర ఎన్ పీలు 0.86 శాతం నుంచి 0.70 శాతానికి వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరానికి ప్రతి షేరుకు 80 పైసల చొప్పున డివిడెండ్ ఇవ్వాలని బ్యాంకు బోర్డు నిర్ణయించింది. షేర్ హోల్డర్ల అనుమతి తీసుకున్నాక దీనిని చెల్లిస్తారు
