
- యావరేజ్గా ప్లాట్ రూ.2.38 లక్షలు
- 18 ప్లాట్ల అమ్మకంతో హౌజింగ్ బోర్డుకు రూ.142 కోట్ల ఆదాయం
హైదరాబాద్/కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో అధికారులు నిర్వహించిన ఖాళీ ప్లాట్ల వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. కాలనీ ఫేజ్ 7లో ఖాళీగా ఉన్న 18 ప్లాట్లకు స్థానిక కమ్యూనిటీ హాల్లో బుధవారం అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే రోడ్డులో హైటెక్ ఆర్వోబీ( రైల్ ఓవర్ బ్రిడ్జి) సమీపంలోని 151.92 గజాల 10వ నంబర్ ప్లాట్గజం రూ.2.98 లక్షలకు అమ్ముడుపోయింది.
మొత్తం 18 ప్లాట్లలో 13 ప్లాట్లు గజం రూ.2 లక్షలకు పైగా పలకగా, 5 ప్లాట్స్ రూ.2 లక్షల లోపు ధర పలికాయి. 18వ నంబర్ ప్లాట్ అత్యల్పంగా రూ.1.14 లక్షలకు అమ్ముడుపోగా.. 10 నంబర్ ప్లాట్ రూ.2.98 లక్షలు పలికింది. మొత్తం ప్లాట్లలో 17 ప్లాట్లు కాలనీ ఏడో ఫేజ్లోనివి కాగా.. ఒక్క ప్లాట్ మాత్రం కైత్లాపూర్లో ఉంది. ఈ 36.16 గజాల కమర్షియల్ ప్లాటే తక్కువ ధర పలికింది.
కైత్లాపూర్లోని ప్లాట్విస్తీర్ణం అత్యల్పం కాగా.. ఏడో ఫేజ్లోని మూడు ప్లాట్లు అత్యధిక విస్తీర్ణంలో ఉన్నాయి. 12వ నంబర్ ప్లాట్ 921.13 గజాలు కాగా.. 13వ నంబర్ ప్లాట్789.27 గజాలు, 14వ నంబర్ ప్లాట్ 978.92 గజాలు ఉంది. మొత్తం ప్లాట్ల విస్తీర్ణం 6,236.33 గజాలు కాగా.. మొత్తం రూ.141,36,89,100 ఆదాయం సమకూరింది. సగటున ఒక్కో గజానికి రూ.2.38 లక్షలు ధర పలికింది.
గజం ధర ఇంత భారీగా పలకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని హౌజింగ్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ ప్లాట్ల వేలంలో మొత్తం 84 మంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కేపీహెచ్బీ కాలనీలో ఖాళీ ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేపీహెచ్బీ పోలీసుస్టేషన్కు తరలించారు.