
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ ఏడాదిలో తొలిసారిగా సోమవారం జలసౌధలో త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని చేపట్టనుంది. తెలంగాణ 16.2 టీఎంసీలు, ఏపీ 10 టీఎంసీలకు ఇండెంట్పెట్టగా.. త్రీమెంబర్ కమిటీ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
వాస్తవానికి ఇప్పటికే ఏపీ కోటాకు మించి వాడుకుని రిజర్వాయర్లు నింపుకున్నా.. మళ్లీ సాగర్ నుంచి తాగునీళ్లు తీసుకెళ్తామంటూ బోర్డుకు లేఖ రాసింది. ఇటు తన కోటా పూర్తిగా వాడుకోని తెలంగాణ.. ప్రజల తాగునీటి అవసరాల కోసం ఇండెంట్ పెట్టింది. ఏపీ మళ్లీ ఇండెంట్ పెట్టడంపై మన అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో ఏపీ తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. ఏపీ పెట్టిన ఇండెంట్ను తిరస్కరించాల్సిందిగా బోర్డును కోరనున్నారు.