హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్ లెఫ్ట్, రైట్ పవర్ హౌజ్లలో రిపేర్లు చేయడానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ పర్మిషన్ ఇచ్చింది. రెండు పవర్ హౌస్లలోని పెన్స్టాక్ ఇన్టేక్ గేట్లకు రిపేర్లు, ఇతర పనులకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశాయి. దీనిపై స్పందించిన కేఆర్ఎంబీ రిపేర్లకు ఓకే చెబుతూ లేఖ పంపింది. మూడు నెలలకుగానూ రెండు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చింది.
తెలంగాణ నుంచి ఈఈ లేదా ఆ పై స్థాయి నలుగురు ఇంజినీర్లు, ఆరుగురు సిబ్బంది, రెండు కార్లు డ్యామ్పైకి వెళ్లడానికి అనుమతించింది. ఏపీ నుంచి ఆరుగురు ఇంజినీర్లు, పది మంది సిబ్బంది, మూడు కార్లకు అనుమతినిచ్చింది. ఏపీ రైట్ బ్యాంక్ పవర్ హౌస్లో పీఐజీ రిపేర్ల కోసం కాంట్రాక్టర్లు ఎమ్ఏ మజార్, ఎస్వీ రమణ, పది మంది చొప్పున పనివాళ్లను తీసుకొచ్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.
నెలరోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించింది. షెడ్యూల్డ్, ఎమర్జెన్సీ పనుల కోసం అనుమతి తప్పనిసరి తీసుకోవాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు తీసుకొచ్చే పనివాళ్లు, ఇంజినీర్లు, సిబ్బంది, వారిని తరలించే వాహనాల వివరాలను పవర్ హౌస్ స్టేషన్ ఇన్చార్జులకు ముందే ఇవ్వాలని కేర్ఎంబీ పేర్కొంది.
