
హైదరాబాద్, వెలుగు: ఇన్సెంటివ్స్ అంశంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నెల 27న జలసౌధలో రెండు రాష్ట్రాల అధికారులతో ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు శనివారం రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ చైర్మన్ లేఖ రాశారు. అధికారులకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ను రద్దు చేయొద్దని కృష్ణా బోర్డుకు ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సమావేశాన్ని నిర్వహించనుంది. బోర్డుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న అధికారులకు బేసిక్ శాలరీపై 25 శాతం ఇన్సెంటివ్స్ను అమలు చేయాలని బోర్డు గతంలో నిర్ణయించింది.
అందుకు తగ్గట్టు రెండేండ్ల పాటు ఇన్సెంటివ్స్ను ఇచ్చింది. అయితే, బోర్డులు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్కు తగ్గట్టు పనిచేయాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. ఇన్సెంటివ్స్ ఇవ్వొద్దని, ఇచ్చిన ఇన్సెంటివ్స్ను ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని ఆదేశించింది. దీనిపై పలువురు ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా.. రికవరీ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అధికారులకు ఇప్పటికే చెల్లించిన ఇన్సెంటివ్స్ను రికవరీ చేయొద్దని, మున్ముందు చెల్లించాలా వద్దా అన్నది బోర్డు ఇష్టమని స్పష్టం చేసింది.