
- మేడిగడ్డ’లో 2 పిల్లర్లు కుంగితేప్రాజెక్టు కూలిందంటున్నరు: కేటీఆర్
- అప్పులు చేసి ఆదాయాన్ని పెంచి పేదలకు పంచినం
- డల్లాస్లో బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ,రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో బీఆర్ఎస్ నేతలుగా తాము ఎప్పుడూ ముందే ఉన్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహాత్ముని స్ఫూర్తితో కేసీఆర్ అందరినీ ఏకం చేసి తెలంగాణను సాధించారని చెప్పారు. మూడేండ్లలో కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం డల్లాస్లో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అక్షయపాత్ర. ఆ ప్రాజెక్టుతో బీడు భూములకూ నీళ్లను మళ్లించాం. నాలుగేండ్లలోనే కాళేశ్వరం నిర్మించిన ఘనత కేసీఆర్ది. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. అయితే మేడిగడ్డ బ్యారేజీలోని ఉన్న 371 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని విషప్రచారం చేస్తున్నరు. మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేసి వాడుకలోకి తేవాలి” అని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర ఆదాయం పెంచి పేదలకు పంచినం
కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్అన్నారు. అప్పులు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ వల్లే అప్పుల్లో కింది నుంచి ఆరో స్థానంలో ఉన్నామని తెలిపారు. అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిన ధాన్యం ఉత్పత్తి రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలిపామన్నారు. రాష్ట్రంలో సంపద పెరిగింది.. భూములపై ఎన్నారైలు పెట్టుబడులు పెట్టారని చెప్పారు. తెలుగు వాళ్లకు టెక్సస్ రూపంలో మూడో రాష్ట్రం ఉందని ఆయన అన్నారు. తనకు ఏమాత్రం అమెరికాలో ఉన్నట్టు అనిపించడం లేదని చెప్పారు. అమెరికాలో మన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసిందని, బీఆర్ఎస్ తరఫున లీగల్ సెల్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తామన్నారు.