- ప్రజలను మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ తప్పుదోవ పట్టిస్తున్నరు
- అధికారంలోకి వస్తే ఓఆర్ఆర్ టోల్ చార్జీలు ఎత్తేస్తామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ విషయంలో మంత్రి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖ మంత్రిగా ఆయనకు లేదా అని నిలదీశారు. టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని, భారీ కుంభకోణానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. ‘‘ఇరుక్కుపోతాననే భయంతోనే కేటీఆర్ ముఖం చాటేసిండు. తెలంగాణ కేబినెట్కేమీ అతీత శక్తులు లేవు.. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు” అని హెచ్చరించారు. గురువారం రేవంత్రెడ్డి తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొంటామన్న సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన ఓఆర్ఆర్ను ఎందుకు ప్రైవేటుకు కట్టబెట్టారో చెప్పాలి? ఓఆర్ఆర్ను అమ్మేసుకునే హక్కు కేసీఆర్కు ఎవరిచ్చారు?” అని మండిపడ్డారు.
ఓఆర్ఆర్ టెండర్లలో బేస్ ప్రైస్ వివరాలను ఎందుకు చెప్పడం లేదని మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ను రేవంత్ ప్రశ్నించారు. అందులో ఏమైనా దేశ భద్రతకు సంబంధించిన రహస్యంగానీ.. కేసీఆర్ ప్రాణంగానీ ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలను అరవింద్ కుమార్ తప్పుదోవ పట్టిస్తున్నారని, బేస్ ప్రైస్ పెట్టకుండా ఎవరైనా టెండర్లను పిలుస్తారా? అని నిలదీశారు. ‘‘మాజర్ సంస్థ నివేదిక ప్రకారమే టెండర్లు ఇచ్చామంటూ అరవింద్ కుమార్ సమర్థించుకుంటున్నరు. కానీ, ఆ సంస్థపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. క్రిసిల్ అనే సంస్థ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను కాదని.. మాజర్ నివేదికను ఎట్ల పరిగణనలోకి తీసుకున్నరు?” అని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి ఓఆర్ఆర్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పరిధిలో ఉండేదని, కానీ, అగ్గువకు ప్రైవేటుకిచ్చేందుకే హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఐఆర్బీకి ఓఆర్ఆర్ను కట్టబెట్టేందుకే హెచ్జీసీఎల్ ఎండీ సంతోష్ను మార్చేసి.. రిటైరైన బీఎల్ఎన్ రెడ్డిని ఆ ప్లేస్లో నియమించారని, ఐఆర్బీ కంపెనీని ముందు పెట్టి.. ఆ తర్వాత కేటీఆర్ బినామీ కంపెనీలు ఇందులో చొరబడేందుకు కుట్ర జరుగుతున్నదని దుయ్యబట్టారు. టెండర్లను ఓపెన్ చేయగానే వివరాలను వెల్లడిస్తారని, కానీ, ఈ విషయంలో మాత్రం 16 రోజులు ఆలస్యంగా వివరాలు చెప్పారని అన్నారు. ఏప్రిల్ 11న టెండర్లను ఓపెన్ చేస్తే.. 27న ప్రకటించారని, ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. దాని వెనుక ఉన్న గూడుపుఠానీ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్హెచ్ఏఐ రూల్స్ ప్రకారం టెండర్లు ఇవ్వలేదు
ఓఆర్ఆర్ టెండర్లపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అభ్యంతరం చెప్పిందని రేవంత్ అన్నారు. ఎన్హెచ్ఏఐ పేర్కొన్న రూల్స్ ప్రకారం టెండర్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. టోల్గేట్పై రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తుందని, ఈ లెక్కన ఏడాదికి రూ.730 కోట్లు, 30 ఏండ్లకు రూ. 22 వేల కోట్ల ఆమ్దానీ వస్తుందని అన్నారు. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.16 వేల కోట్ల బ్యాంకు రుణం వస్తుందని చెప్పారు. కానీ, అతి తక్కువ ధరకే ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టిందని రేవంత్ మండిపడ్డారు.
ఐఆర్బీ సంస్థ బిడ్లో రూ.7,272 కోట్లే కోట్ చేసిందని, కానీ, వివరాలు ప్రకటించే నాటికి అది రూ.7,380 కోట్లుగా ఎలా మారిందని ప్రశ్నించారు. టెండర్ దక్కించుకున్న సంస్థనే గ్రీనరీ బాధ్యతను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని, కానీ ఆ సంస్థకు దాని నుంచి మినహాయింపునిచ్చారని తెలిపారు. గ్రీనరీ నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.40 కోట్లు అయితే.. 30 ఏండ్లకు రూ.1,200 కోట్లు అవుతుందని వివరించారు. ఈ లెక్కన ఐఆర్బీకి 30 ఏండ్లపాటు ఓఆర్ఆర్ టెండర్ రూ.6,180 కోట్లకే దక్కినట్టని ఆయన తెలిపారు.
కాగ్కు ఫిర్యాదు చేస్తం
ఓఆర్ఆర్ అంశంపై ఆర్టీఐ ద్వారా వివరాలను అడిగినా ఇవ్వడం లేదని రేవంత్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా అని ప్రశ్నించారు. టెండర్ల విషయంపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కాగ్కు కూడా అన్ని వివరాలతో ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కాగా, ఈనెల 8న సరూర్నగర్లో నిర్వహించే సభకు ప్రియాంకా గాంధీ వస్తున్నారని, అందులో యూత్ డిక్లరేషన్ను ప్రకటిస్తామని రేవంత్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓఆర్ఆర్పై టోల్ చార్జీలను ఎత్తేస్తామని ఆయన మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు. ఓఆర్ఆర్ మీదున్న రుణాలు ఇప్పటికే తీరిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా దాని నిర్వహణను చూసుకుంటుందని చెప్పారు. ఓఆర్ఆర్పై ప్రతి ఒక్కరికీ ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.
ఐఆర్బీపై క్రిమినల్ కేసులన్నయ్
ఓఆర్ఆర్ టెండర్ను దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై క్రిమినల్ కేసులున్నాయని రేవంత్ ఆరోపించారు. కంపెనీపై సీబీఐ కేసు ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2017లో కొద్దిరోజుల పాటు ఈ సంస్థే ఓఆర్ఆర్ టోల్ నిర్వహణ బాధ్యత చేపట్టిందని గుర్తు చేశారు. రోజుకు రూ.87 లక్షలు చెల్లించాల్సి ఉన్నా.. కేవలం రూ.60 లక్షలే చెల్లిస్తుండడంతో రూ.25 కోట్ల డిపాజిట్ను సీజ్ చేసి కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టిన విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. అట్లాంటి కంపెనీని మళ్లీ ఇప్పుడు తెరమీదికి ఎట్లా తెచ్చారని నిలదీశారు. ఓఆర్ఆర్పై 30 ఏండ్లకుగానూ 48 గంటల్లోనే రూ.15 వేల కోట్ల రుణాన్ని బ్యాంకు నుంచి ఇప్పిస్తానని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుత టెండర్లను వెంటనే రద్దు చేయాలని, స్విస్ చాలెంజ్ విధానంలో బేస్ ప్రైస్ రూ.7,388 కోట్లతో టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.