
రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్ హయాంలో పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న మాజీ ఎంపీటీసీ కట్కబోయిన కుంటయ్య డెడ్బాడీ వద్ద బుధవారం నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. కుంటయ్య భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడంతో ఆయన తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేయగా.. పోలీసులు కుంటయ్యపైనే ఉల్టా కేసు పెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ లీడర్ భూమిని కబ్జా చేయడం, పోలీసులు వేధించడం వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నాడన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం మంచిది కాదన్నారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏసీబీ విచారణ సందర్భంగా హైదరాబాద్ వచ్చి తనకు ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేసిందన్నారు. కుంటయ్య పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ల బాధ్యత తనదేనని, కుంటయ్య ఫ్యామిలీకి పార్టీ అండగా ఉంటుందన్నారు.