విచారణకు వస్తా.. అన్ని విధాలుగా సహకరిస్తా: ఏసీబీ నోటీసులపై స్పందించిన KTR

విచారణకు వస్తా.. అన్ని విధాలుగా సహకరిస్తా: ఏసీబీ నోటీసులపై స్పందించిన KTR

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా 2025, జూన్ 16 ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని తెలిపారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తూ.. రోజుకో కుట్ర చేస్తున్నాడని విమర్శించారు.

ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో  తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని సీఎం రేవంత్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్‎లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాక మరోసారి తనకు ఏసీబీ నోటీసులు పంపారని ఆరోపించారు. 

లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా..?:

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కేసులో తాను లైడిటెక్టర్ టెస్ట్‎కు సిద్ధమని.. ఓటుకు నోట్ కేసులో సీఎం రేవంత్ లై డిటెక్టర్ పరీక్ష సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశాడు.  ‘‘పదేళ్ల క్రితం నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‎గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ కేసు కూడా ఏసీబీ పరిధిలో పెండింగ్‎లో ఉంది.

►ALSO READ | మావోయిస్టులు ఉగ్రవాదుల కంటే ప్రమాదమా.?: ఎమ్మెల్యే కూనంనేని

ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం సీఎంకు ఉన్నదా..? లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్దం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తున్నా . విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’’ అని సవాల్ విసిరారు.