రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయన్నారు మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ మీటింగ్ లో పాల్గొన్న ఆయన.. మూసీ నది సుందరీకరణ, నది ఒడ్డున ట్రామ్, నదిపైన ఫ్లై ఓవర్లు నిర్మించాలన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ కు నీళ్లు తరలించవచ్చన్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు వదిలితే మురుగు కాకుండా మంచినీళ్లు పారుతాయని చెప్పారు.
పాత బస్తీ రోడ్ల విస్తరణ సమస్యలకు కేటాయించిన రూ.150కోట్లును వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. ఓల్డ్ సిటీలో ప్రజలతో మమేకమై పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మూసీ నదిపై 14 బ్రిడ్జ్ లకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని.. త్వరలోనే టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఒక వైపు నుంచి మరోవైపు ను కలుపుతూ సిటీ మధ్య నుంచి 4, 6 లేన్ల ఎక్స్ ప్రెస్ వే ప్రణాళిక ఉందని చెప్పారు కేటీఆర్.