- మూసీపై 14 ఐకానిక్ బ్రిడ్జీలు నిర్మిస్తం: కేటీఆర్
- కుతుబ్షాహీ టూంబ్స్.. గోల్కొండ కోటకు హెరిటేజ్ హోదా కోసం ప్రయత్నిస్తున్నం
- చార్మినార్ పెడస్ట్రెయిన్ ప్రాజెక్టుకు వంద కోట్లైనా ఖర్చు చేస్తం
- అభివృద్ధిలో రాష్ట్రమంతటికీ సమప్రాధాన్యం ఇస్తున్నమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో తాము బద్లా(ప్రతీకారం) కోరుకోవట్లేదని.. బద్లావ్(మార్పు) రావాలని కోరుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. బద్లా రాజకీయాలు చేసేది ఎవరో అందరికీ తెలుసన్నారు. రాజకీయాల్లో మార్పు తేవాలనేదే తమ ప్రయత్నమన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రమంతటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై ఎలాంటి వివక్ష చూపించడం లేదన్నారు. ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన షార్ట్ డిస్కషన్కు ఆయన సమాధానమిచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ములుగులో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా చేస్తామని హామీ ఇచ్చామని, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కను గెలిపించినా ఇచ్చిన హామీని నెరవేర్చామని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని.. ఏం కావాలో అడగాలని, డిమాండ్ చేయాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఓల్డ్ సిటీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ నుంచి రూ.13,693 కోట్లు, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రూ.1,193 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2014 వరకు ఓల్డ్ సిటీ అభివృద్ధికి రూ.3,934 కోట్లే ఖర్చు చేస్తే, తాము ఏడేండ్లలోనే 4 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టామన్నారు. హైదరాబాద్ సిటీ 675 చదరపు కి.మీ.లు విస్తరించి ఉంటే అందులో ఓల్డ్ సిటీ 102 చ.కి.మీ.లన్నారు. ఓల్డ్ సిటీలో రోడ్ల అభివృద్ధి, నిర్మాణం, వేరే పనులకు రూ.1,839 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్లో ఓల్డ్ సిటీలోని మిగతా రోడ్లను చేర్చుతామన్నారు. రోడ్ల విస్తరణలో భూ సేకరణకే రూ.494 కోట్లు ఖర్చు చేశామన్నారు. 68.52 కి.మీ.ల పొడవైన రోడ్లకు రూ.67 కోట్లతో రిపేర్లు చేశామన్నారు. చార్మినార్ పెడస్ట్రెయిన్ ప్రాజెక్టుకు రూ.33 కోట్లు ఖర్చు చేశామని, ఇంకో వంద కోట్లు పెట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.
రెండేండ్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తి
దుర్గం చెరువుపై కట్టిన కేబుల్ బ్రిడ్జిలా మూసీపై 14 ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. రూ.19.30 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురాకముందు ఓల్డ్ సిటీలో నాలాల అభివృద్ధికి రూ.242 కోట్లు కేటాయించామని, ఎస్ఎన్డీపీ కింద ఇంకో రూ.261 కోట్లు కేటాయించామన్నారు. కొత్తగా 14 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని తెలిపారు. పాతబస్తీలో 15 వేలకు పైగా డబుల్ ఇండ్లు కట్టామని, వాటిలో 4,500లకు పైగా పూర్తయ్యాయని తెలిపారు. వెయ్యి ఇండ్లకు పైగా లబ్ధిదారులకు అప్పగించామన్నారు.
ఆ అథారిటీకి రెండేళ్లుగా నిధులివ్వలే
కులీ కుతాబ్షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రెండేళ్లుగా తాము పని ఇవ్వలేదని, నిధులు విడుదల చేయలేదని కేటీఆర్ తెలిపారు. కుతుబ్షాహీ టూంబ్స్, గోల్కొండ కోటకు హెరిటేజ్ హోదా కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
నేతన్నల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
చేనేత కళాకారులను రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తుందని కేటీఆర్ అన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన జాతీయ అవార్డు అందుకున్న కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్, మెరిట్ సర్టిఫికెట్ సాధించిన సాయిని భరత్, దుద్యాల శంకర్, తడక రమేశ్ను అసెంబ్లీలోని తన చాంబర్లో కేటీఆర్ సన్మానించారు.
రాష్ట్రమంతా దళిత బంధు ఇస్తం
ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తామని కేటీఆర్ చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి దళితబంధు వస్తదంటే రాజీనామా చేస్తానన్నారని, ఆ అవసరం రాదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా మాదిరిగా దళిత బంధు అమలు చేస్తామన్నారు. ఎవరైతే శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణమయ్యారో, వాళ్లే ఇప్పుడు ఆయన విగ్రహానికి దండ వేస్తామనడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు. జంగ్ సైరన్ అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ జంగ్ పట్టిన తుపాకీ అని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు పంచన ఉండి తుపాకీ పట్టుకుని ఉద్యమకారుల మీదకు పోయింది రేవంత్ రెడ్డి కాదా ? అని ప్రశ్నించారు.