- పదేండ్లలో తెలంగాణకు ఆ పార్టీ చేసిందేమీలేదు: కేటీఆర్
- రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు
- నాగర్ కర్నూలులో వందశాతం బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా
హైదరాబాద్, వెలుగు : గత పదేండ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని, రాష్ట్రంలో అసలు ఆ పార్టీకి స్థానమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చరిత్రలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మూటగట్టుకున్నదని ఆరోపించారు. వంద రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజానీకానికి ఉన్న అన్ని భ్రమలు తొలగిపోయాయని అన్నారు. నాగర్ కర్నూలు లోక్ సభ నియోజకవర్గ ముఖ్యనేతలతో శనివారం హైదరాబాద్లో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ స్థానం నుంచి బీఆర్ఎస్
అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వందకు వందశాతం గెలవబోతున్నారన్నారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి.. అత్యధిక మెజారిటీ సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని కేటీఆర్ విమర్శించారు. ఇటీవల కొడంగల్లో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రిలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని చెప్పారు.
తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని సీఎం అసహనంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పరిపాలన చేతకాకపోవడం వల్లే ప్రజల దృష్టిని మరల్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలుచేయని ఈ అసమర్థ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టంచేశారు.