కూతురి ప్రేమ పెళ్లి.. ఉరేసుకున్న తల్లి

 కూతురి ప్రేమ పెళ్లి.. ఉరేసుకున్న తల్లి

కూకట్​పల్లి, వెలుగు: కూతురు తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెండ్లి చేసుకుందనే మనస్తాపంతో తల్లి సూసైడ్​ చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జయనగర్​లో నివసించే గోనుగుంట నిర్మల(45), శ్రీనివాసరావు దంపతులకు కూతురు(25), కొడుకు ఉన్నారు. కూతురు ప్రైవేట్ జాబ్​ చేస్తోంది.  కొంతకాలంగా కూకట్​పల్లికే చెందిన తన క్లాస్​మేట్ తో  ప్రేమలో ఉంది. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అయితే తాను ప్రేమించిన యువకుడినే పెండ్లి చేసుకుంటానని ఆమె తెగేసి చెప్పడంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 

ఈ నేపథ్యంలోనే వారంక్రితం ఆ యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన యువకుణ్ని పెండ్లి చేసుకుంది. ఈ పరిణామంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కుమిలిపోయారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిర్మల ఫ్యాన్​కు ఉరేసుకొని చనిపోయింది. సాయంత్రం 6 గంటలకు కాలేజీ నుంచి వచ్చిన కుమారుడు బెడ్​ రూమ్​ లాక్ ​చేసి ఉండటం గమనించి, మరో కీతో తలుపు తీసి చూడగా.. నిర్మల చీరతో ఫ్యాన్​కు ఉరి వేసుకుని కనిపించింది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.