చేవెళ్ల, వెలుగు: పట్టుదలకు మారుపేరు కొండా వెంకట రంగారెడ్డి అని చేవెళ్ల మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ తొలి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీ రంగారెడ్డి 133వ జయంతి సందర్భంగా మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో కేవీ రంగారెడ్డిది ప్రత్యేక స్థానం అన్నారు.
అసమాన నాయకత్వ లక్షణాలున్న ఆయన చిన్నతనం నుంచే చదువు మీద ఆసక్తితో, ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. న్యాయవాదిగా, మానవతా విలువలు కలిగిన పాలకుడిగా కేవీ రంగారెడ్డి ప్రజలకు దగ్గరయ్యారన్నారు. రెవెన్యూ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక భూ సంస్కరణలు తీసుకువచ్చిన నేత రంగారెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో కొండా రాందేవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, నాయకులు పాండురంగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.