హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ అనుచరు లు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై పట్టపగలు దాడి చేశారని, ప్రభుత్వ ఆస్తులను కేంద్ర మంత్రి సంజయ్ మనుషులు ధ్వంసం చేయడం దారుణమని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ఎల్. రమణ అన్నారు. కేటీఆర్పై బజారు భాషను వాడడమే కాకుండా.. ప్రశాంతంగా ఉండే కరీంనగర్ రాజకీయాలను సంజయ్ చెడగొడుతున్నారని విమర్శించారు. ధ్వంసానికి పాల్పడిన గూండాలపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్యే సంజయ్తో కలిసి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు.
బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. సంజయ్కు చట్టాల మీద ఏమాత్రం నమ్మకమున్నా తన గూండాలను పోలీసులకు అప్పగించాలన్నారు. శాంతిభద్రతల బాధ్యతలు చూడాల్సిన బండి సంజయ్.. ప్రభుత్వ ఆఫీసు అయిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేయించారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. సంజయ్ వ్యవహారాన్ని ప్రధాని మోదీ గమనించాలన్నారు. చదువు, సంధ్య లేని బండి సంజయ్.. మాట్లాడే తెలివి లేక దాడి చేయించారన్నారు. ఇక్కడ హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కలిసి మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
