బొగ్గుబావుల వేలం రద్దు చేయాలె కార్మిక సంఘాల డిమాండ్

బొగ్గుబావుల వేలం రద్దు చేయాలె  కార్మిక సంఘాల డిమాండ్
  •   రాజ్​భవన్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు: బొగ్గుబావుల వేలాన్ని కేంద్రం రద్దు చేయాలనే డిమాండ్ తో కార్మిక సంఘాలిచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, నెక్లెస్ రోడ్, రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాల నేతలు, సింగరేణి కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ముషీరాబాద్, చిక్కడపల్లి, ఎస్​ఆర్.నగర్, పంజాగుట్ట, బేగంపేట, గోషామహల్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.

  ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్, బాలరాజు, సీతారామయ్య, మందా నర్సింహారావు మాట్లాడుతూ... బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగానే, పదో విడత బొగ్గుబావుల వేలం ప్రక్రియ ప్రారంభించిందని చెప్పారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర గనుల శాఖను కేటాయించి.. హైదరాబాద్ నుంచే వేలం ప్రక్రియను ప్రారంభించడం దారుణమన్నారు.

 గోదావరి పరివాహక ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుకు కూడా వేలం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వం బొగ్గుబావులను సింగరేణికి కేటాయించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఎన్నోఏండ్లుగా ప్రభుత్వం రంగంలో కొనసాగుతున్న ఏకైన సంస్థ సింగరేణి మాత్రమేనని చెప్పారు. కేంద్రం బొగ్గుబావుల ప్రైవేటీకరణతో సింగరేణికి, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో ఆర్డీ చంద్రశేఖర్, రెబ్బ రామారావు, రాంబాబు యాదవ్, ఎండీ యూసుఫ్, జే.వెంకటేశ్, కూరపాటి రమేశ్, ఈశ్వర్ రావు, వంగూరు రాములు, ప్రవీణ్, శివబాబు తదితరులు పాల్గొన్నారు.