అదనపు కట్నం కోసం భార్యను బ్లాక్ మెయిల్

అదనపు కట్నం కోసం భార్యను బ్లాక్ మెయిల్

విబేధాల కారణంగా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఓ లేడి డాక్టర్ రెండవ పెళ్లి చేసుకున్నా కూడా ఆమె కష్టాలు తీరలేదు. చదువు, సంస్కారం, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలున్న ఉద్యోగమున్నా కూడా ఆమెకు వేధింపులు రెండవ భర్త రూపంలో మళ్లీ ఎదురయ్యాయి.

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి పట్టణానికి చెందిన ఓ లేడీ డాక్టర్‌  విబేధాలతో మొదటి భర్త నుంచి విడిపోయింది. 2019 ఫిబ్రవరిలో ఆమె చిత్తూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్న ఆ భర్త తర్వాత తన అసలు రంగును బయటపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలని, లేదంటే తాము ఏకాంత సమయంలో తీసుకున్న వీడియోను ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.

అతని వేధింపులు తట్టుకోలేక  చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. నిందితుడిని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.