లారీ బోల్తా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

లారీ బోల్తా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది. బియ్యం లోడుతో బెంగుళూరు వెళ్తున్న లారీని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన  
రాజ్యలక్ష్మి(27), శ్రీనివాస్‌(29), రోహిత్‌(2)లు ఎక్కారు. వీరు బియ్యం బస్తాల మీద లారీ వెనుక వైపు కూర్చున్నారు. అయితే లారీని క్లీనర్ నడపడంతో.. ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు బియ్యం బస్తాల కింద పడి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో లారీని పైకి లేపి బియ్యం బస్తాల కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు. కాగా.. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువుల రోదన మిన్నంటింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.