
లష్కర్ బోనాలు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం (జలై 13) ఉదయం 4 గంటలకు ఉజ్జయినీ అమ్మవారి ద్వారలు తెరవడంతో ప్రారంభమైన బోనాల ఉత్సవానికి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
బోనాల ఉత్సవాలలో ఎంతో ప్రత్యేక ఘట్టమైన రంగం భవిష్యవాణి సోమవారం (జులై 14) నిర్వహించనున్నారు. రంగం కార్యక్రమం కోసం కుమ్మరి ఇంటి నుంచి పండితులు మేళతాళాలతో పచ్చి కుండను ఆలయానికి తీసుకురానున్నారు. ఉదయం 8-9 గంటల ప్రాంతంలో భవిష్యవాణి కార్యక్రమం మొదలవుతుంది. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పనున్నారు.
రంగం అనంతరం , ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పలహర బండ్ల ఊరేగింపు చేబడతారు. ఈ ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరు లోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి 33 ఏళ్ల లక్ష్మీ అనే ఆడ ఏనుగును ఇప్పటికే తెలంగాణకు తీసుకువచ్చారు. అటవీ శాఖ చట్టాల ప్రకారం అన్ని జాగ్రత్తలతో శనివారం(జులై 12) ఏనుగును తీసుకొచ్చారు అధికారులు . ఈ ఏనుగు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా అంబారీ ఊరేగింపులో పాల్గొంటుంది.
లష్కర్ బోనాలు ముగిసిన తర్వాత.. 20వ తేదీన మండిలోని నల్లపోచమ్మ, మహంకాళి దేవాలయం, 21వ తేదీన అక్కన్న మాదన్న ఆలయాలకు సంబంధించి అమ్మవారి ఊరేగింపు లో ఏనుగు లక్ష్మీ పాల్గొంటుంది. వేడుకల అనంతరం జూలై 23న ఏనుగును తిరిగి కర్ణాటకకు తరలిస్తారు అధికారులు.