
- లాఠీతో కొట్టిన ఏఎస్సై
- చేయి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్
- రోడ్డు వెంబడి వెళ్తూ వీడియో
- తీసి వైరల్ చేసిన వ్యక్తి
మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఓ మహిళపై ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టడమే కాకుండా చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టణంలోని గోల్ హనుమాన్ ఏరియాలో ఉండే భార్యాభర్తలు గొడవ పడి గురువారం మెట్పల్లి పీఎస్కు వచ్చారు. పీఎస్ ఆవరణలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో అక్కడే ఉన్న ఏఎస్సై ఆంజనేయులు లాఠీతో సదరు మహిళను నాలుగు దెబ్బలు కొట్టాడు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ అశోక్ కూడా ఆమెపై చేయి చేసుకుని అక్కడి నుంచి తరిమేశాడు. ఈ ఘటనను రోడ్డుపై నుంచి వెళ్తున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. ఎస్సై చిరంజీవి వివరణ కోరగా స్టేషన్ ఆవరణలో భార్యాభర్తలు కొట్టుకోవడంతో వారిని సముదాయించి పంపించేశారని అన్నారు.