టెక్నికల్ ఇష్యూలే కారణమన్న ఇస్రో
న్యూఢిల్లీ: టెక్నికల్ ఇష్యూల కారణంగా జీశాట్ 1 ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది. ఈ శాటిలైట్ను తిరిగి ఎప్పుడు ప్రయోగించేది తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. ఇస్రో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జీశాట్1 శాటిలైట్ను మార్చి 5(గురువారం) ప్రయోగించాలి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో దీనికోసం సైంటిస్టులు ఏర్పాట్లు కూడా చేశారు.జీఎస్ఎల్వీఎఫ్10 రాకెట్లో శాటిలైట్ను చేర్చి, కౌంట్డౌన్ కూడా స్టార్ట్ చేశారు. చివరి నిమిషంలో టెక్నికల్ కారణాలతో ప్రయోగాన్ని ఆపేశారు. కౌంట్డౌన్ నిలిపేసినట్లు ఇస్రో ట్విట్టర్లో వెల్లడించింది. అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం పరిశీలిస్తూ రియల్ టైమ్ ఫొటోలను పంపడం, ప్రకృతి విపత్తులను మానిటర్ చేయడం కోసం సైంటిస్టులు ఈ శాటిలైట్ను ప్రయోగిస్తున్నారు. మన దేశం చేపట్టిన తొలి జియోస్టేషనరీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం ఇదే.