వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు నిరసిస్తూ కాంగ్రెస్ లీడర్ల ఆందోళన

వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు నిరసిస్తూ కాంగ్రెస్ లీడర్ల ఆందోళన
  •     ఐటీ దాడులు పిరికిపంద చర్య
  •     ఓటమి భయంతోనే దాడులు
  •     భగ్గుమన్న కాంగ్రెస్, సీపీఐ
  •     పలు చోట్ల నిరసన ర్యాలీలు

కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూర్​లో కాంగ్రెస్​అభ్యర్థి వివేక్ ​వెంకటస్వామి గెలుపు ఖాయమైందనే అక్కసుతోనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్ర పన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని కాంగ్రెస్, సీపీఐ ​నేతలు భగ్గుమన్నారు. ఈ దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మంగళవారం చెన్నూర్, మందమర్రి తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, సీపీఐ, ఏఐటీయూసీ, ప్రజా సంఘాల లీడర్లు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చెప్పట్టారు. 

మందమర్రి మార్కెట్​వద్ద జరిగిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లు సలేంద్ర సత్యనారాయణ, భిమనాథుని సుదర్శన్, కంపెల్లి సమ్మయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. బాల్క సుమన్ ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు చేపిస్తున్నారని ఫైర్​అయ్యారు. ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతోనే దిక్కుతోచని స్థితిలో కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ, ఈడీ దాడులు చేపిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. 

ఓటమి తప్పదని భావించిన బాల్క సుమన్ వివేక్ వెంకటస్వామిపై ఐటీ శాఖకు తప్పుడు ఫిర్యాదు చేశాడని మండిపడ్డారు. ఇసుక దందాతో వేల కోట్లు దండుకున్న సుమన్​ను తరిమికొట్టేందుకు చెన్నూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వివేక్ ​వెంకటస్వామి ఇంటిపై  ఐటీ దాడులను మందమర్రి పట్టణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బాల్క సుమన్​ఓటమి భయంతోనే ప్రభుత్వంతో ఇలాంటి దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్,  జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు కనకం రాజు, చోటేమియా, కిరణ్, సది, అంజయ్య,  బోయిన్​పల్లి రమేశ్ పాల్గొన్నారు.

వివేక్ వెంకటస్వామికి మద్దతుగా సీపీఐ, ఏఐటీయుసీ ప్రచారం

నస్పూర్, వెలుగు: చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని సీపీఐ, ఏఐటీయూసీ నేతలు మందమర్రి మార్కెట్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు. దాదాపు 400 మంది ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ రక్షణ కాంగ్రెస్​తోనే సాధ్యమన్నారు. వివేక్​వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‌నాయకులు సలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శనం, రాయబారపు వెంకన్న, బండారి రాజేశం, జెట్టి మల్లయ్య, నాగరాజు, వెల్ది ప్రభాకర్, దినేశ్, ఎలిగేటి వజ్ర, దొంతుల రాజ్యం తదితరులు పాల్గొన్నారు.