పాగాల ఫ్యామిలీకి అండగా ఉంటాం : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

పాగాల ఫ్యామిలీకి అండగా ఉంటాం : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి
  • జనగామలో సంపత్‌‌రెడ్డి సంతాప సభ

జనగామ, వెలుగు : గుండెపోటుతో చనిపోయిన జనగామ జడ్పీ చైర్మన్‌‌ పాగాల సంపత్‌‌రెడ్డి ఫ్యామిలీకి అండగా ఉంటామని జనగామ, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, కడియం శ్రీహరి చెప్పారు. బుధవారం యశ్వంతాపూర్‌‌లోని పార్టీ ఆఫీస్‌‌లో సంపత్‌‌రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడం వల్లే సంపత్‌‌రెడ్డికి జడ్పీ చైర్మన్‌‌తో పాటు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం వచ్చిందన్నారు.

పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి చనిపోవడం బాధాకరం అన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి రాకపోవడంతో సంపత్‌‌రెడ్డి బాధ పడ్డారని, ఆ రందితోనే గుండెపోటుకు గురై చనిపోయినట్లు చెప్పారు. ఉద్యమకారుడి ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్‌‌ హామీ ఇచ్చారన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలో లేకున్నా ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఆప్కో మాజీ చైర్మన్‌‌ మండల శ్రీరాములు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ పోకల జమున లింగయ్య, మారుజోడు రాంబాబు, డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజు, జడ్పీటీసీ నిమ్మతి దీపికా మహేందర్‌‌రెడ్డి, మేకల కలింగరాజు పాల్గొన్నారు.

హనుమకొండ, వెలుగు : జనగామ జడ్పీ చైర్మన్‌‌ పాగాల సంపత్‌‌రెడ్డి సంస్మరణ సభను బుధవారం హనుమకొండ జిల్లా పార్టీ ఆఫీస్‌‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్‌‌ భాస్కర్‌‌ మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపించిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం అన్నారు. సంపత్‌‌రెడ్డి ఫ్యామిలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.