
లీడ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్ట్కు ఎలాంటి పిచ్ను సిద్ధం చేస్తున్నారు..? ఇంగ్లండ్ బజ్బాల్ స్ట్రాటజీకి ఇది అనుకూలిస్తుందా..? అనుభవం లేని టీమిండియా లైనప్కు దీనిపై సవాలు ఎదురుకానుందా..? వీటన్నింటికి లీడ్స్ క్యూరేటర్ హెడ్ రిచర్డ్ రాబిన్సన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘లీడ్స్లో సాధారణంగా పొడి వాతావరణం ఉంటుంది. తొలి రోజున పేసర్లకు అనుకూలించొచ్చు. తర్వాత వేడి కారణంగా పిచ్ ఫ్లాట్గా మారనుంది. అప్పుడు బ్యాటర్లకు ఉపయోగకరంగా మారుతుంది.
ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్కు ఇది సరిపోతుంది. అదే టైమ్లో అనుభవం లేని టీమిండియా లైనప్కు కూడా పరీక్షగా మారొచ్చు. మొత్తానికి ఇరుజట్లకు సవాలు విసిరే పిచ్ను సిద్ధం చేస్తున్నాం’ అని రాబిన్సన్ వెల్లడించాడు. సాధారణంగా సిరీస్ మధ్య మ్యాచ్లను లీడ్స్లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు తొలి టెస్ట్కే ఆతిథ్యమిస్తుండటంతో అందరి దృష్టి పిచ్పై నెలకొంది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ఈ సిరీస్లో ఎలా ఆడుతుందన్న సందేహాలు మొదలయ్యాయి.
జట్టులో సీనియర్ అయిన కేఎల్ రాహుల్కు సెనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై సాధారణమైన రికార్డే ఉంది. కాబట్టి ఈ సిరీస్లో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ఇంగ్లండ్లో తొలిసారి పర్యటిస్తున్న యశస్వి జైస్వాల్, 2017లో చివరి టెస్ట్ ఆడిన కరుణ్ నాయర్ కూడా బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం చాలా ఉంది. సోమవారం లీడ్స్కు చేరుకున్న టీమిండియా.. ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంది. అయితే రోజంతా పిచ్పై కవర్లు కప్పి ఉంచడంతో ప్లేయర్లు అటువైపుగా వెళ్లలేదు. 2021లో ఇక్కడ ఇన్నింగ్స్ తేడాతో ఓడిన ఇండియా 2022లో మాత్రం నెగ్గింది.