పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఏ తోయిబా మిలిటెంట్లపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడిలో లష్కర్ ఏ తోయిబా కమాండర్ షేక్ అఫ్రిదీ హతమయినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు అఫ్రిదీ అత్యంత సన్నిహితుడు. ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ లో లష్కర్ ఏ తోయిబా కార్యకలాపాలను పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. షేక్ అఫ్రిదీని హత్య చేసేందుకు లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్న ఉగ్రగ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఇటీవల దాడులు పెరిగాయి. ఏప్రిల్ 16న లాహోర్ లో లష్కర్ ఏ తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. హఫీజ్ సయీద్ తర్వాత లష్కర్ ఏ తోయిబా గ్రూపులో అత్యంత సీనియర్ అమీర్ హమ్జా. ఈ దాడిలో అమీర్ హమ్జా మృతిచెందినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. మార్చిలో జరిగిన మరో దాడిలో జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు మహ్మద్ తాహిర్ అన్వర్ మృతిచెందాడు. అతని మరణాన్ని జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్ లో ధృవీకరించారు.
షేక్ అఫ్రిది ఎవరు?
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో లష్కర్-ఎ-తైబా ప్రాంతీయ నెట్వర్క్లో అఫ్రిది కీ రోల్ పోషిస్తున్నాడు. లష్కర్ ఏ తోయిబా సంస్థ కోసం కొత్త వ్యక్తుల రిక్రూట్, సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో చురుగా పనిచేశాడు. కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం , సంస్థకు అనుగుణంగా పనిచేయిండం ఇతని పని. జమ్మూ కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్లకు సంబంధించిన కార్యకలాపాలలో అతనికి ప్రమేయం ఉందని భద్రతా అధికారులు అనుమానించారు.

