
- అఖిలపక్ష భేటీలో అపొజిషన్ నేతల డిమాండ్
- గత సెషన్ మాదిరిగా సభను అడ్డుకోవద్దు: రాజ్ నాథ్
- ఏపీ, బిహార్, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ, ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ
- ఫిరాయింపులపై కమిటీ వేయాలి: బీఆర్ఎస్ పక్ష నేత సురేశ్ రెడ్డి డిమాండ్
- ఇయ్యాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ, వెలుగు : పార్లమెంట్లో తమ గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని అపొజిషన్ సభ్యుడికే ఇవ్వాలని పట్టుబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్, నిరుద్యోగం, ధరలు పెరుగుదల, అగ్నివీర్ పథకం, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి, కన్వర్ యాత్ర వివాదం వంటి పలు అంశాలను ప్రతిపక్ష నేతలు లేవనెత్తారు.
గత సెషన్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు కంటిన్యూగా నిరసనలు తెలుపుతూ అంతరాయం కలిగించాయని, ఈ సెషన్ లో అలాంటివి జరగకూడదని రాజ్ నాథ్ కోరారు. ఉభయసభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ప్రతిపక్షాలను అనుమతించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకే కేటాయించాలని, ఈ పదవిని ఖాళీగా ఉంచడం సరికాదన్నారు. ఏపీ, బిహార్కు ప్రత్యేక హోదా కేటాయించాలని టీడీపీ, ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ డిమాండ్ చేశాయి.
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: వైసీపీ
ఎన్నికల అనంతరం ఏపీలో హింస చెలరేగుతోందని, ప్రతిపక్షంపై దాడులు జరుగుతున్నాయని అఖిలపక్ష భేటీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో ప్రస్తుతం చట్టాలను తుంగలో తొక్కుతూ అరాచక పాలన సాగుతోందని.. అందుకే రాష్ట్రపతి పాలన పెట్టడం ఒక్కటే పరిష్కారమన్నారు. కేంద్రం నుంచి ఏపీకి నిధులు తక్కువగా వస్తున్నాయని, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను నిధుల కోత ద్వారా శిక్షించినట్టుగా ఉందన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని మేం డిమాండ్ చేస్తుంటే.. దీనిపై అధికార టీడీపీ మాత్రం సైలెంట్ గా ఉందని ఆయన విమర్శించారు.
టీడీపీ ప్రత్యేక హోదా కోరలేదేం: జైరాం
బిహార్కు, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని జేడీయూ, వైసీపీ కోరాయని, కానీ దీనిపై టీడీపీ ఎలాంటి విజ్ఞప్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఆయన ట్విట్టర్లో ఈమేరకు పోస్టు పెట్టారు. ‘‘ఒడిశాకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ 2014 ఎన్నికల్లోనే మేనిఫెస్టోలో పెట్టింది. ఆ విషయాన్ని ఇప్పుడు బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా గుర్తు చేశారు. ఒడిశాలో మారిన ఈ రాజకీయ పరిణామం కూడా చిత్రంగా ఉంది” అని పేర్కొన్నారు. పార్లమెంట్ పాత బిల్డింగ్లోని సెంట్రల్ హాల్ నిరుపయోగంగా ఉందని, దానిని ఎంపీలు ఒకరినొకరు కలుసుకునేందుకు ఓపెన్ చేయాలని జైరాం మరో ట్వీట్లో కోరారు.
ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధం: కిరెన్ రిజిజు
అఖిలపక్ష భేటీకి 44 పార్టీల నుంచి 55 మంది నేతలు హాజరయ్యారని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ను సజావుగా నడపడం ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం బాధ్యత కూడా అని ఆయన స్పష్టం చేశారు. రూల్స్ కు కట్టుబడి ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కీలకమైన 24 శాఖలకు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కోరినట్టు తెలిపారు.
మంత్రులతో ఎంపీలు నేరుగా సంప్రదింపులు జరిపేందుకు సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని కూడా కోరినట్టు వెల్లడించారు. కాగా, అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రి జెపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, కె సురేశ్ హాజరయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.ఆర్ సురేష్ రెడ్డి, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల (బడ్జెట్) సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ లో ఆగస్టు12 వరకు19 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజున (సోమవారం) సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. రెండోరోజున (మంగళవారం) కేంద్ర బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను సభ ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర బడ్జెట్, జమ్మూకాశ్మీర్ బడ్జెట్ కూడా పార్లమెంట్ ఆమోదం పొందనున్నాయి. ఈ సమావేశాల్లో నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత తదితర సమస్యలపై ఎన్డీయే సర్కారును ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
ఫిరాయింపులపై కమిటీ వేయాలి: సురేశ్ రెడ్డి
పార్టీ ఫిరాయింపులు జరగకుండా పార్లమెంట్ ఉభయసభల సీనియర్ ఎంపీలతో కమిటీ వేయాలని అఖిలపక్ష భేటీలో కోరినట్టు బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేశ్ రెడ్డి తెలి పారు. మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ వాగ్వాదాలతో విలువైన సభా సమయం వృధా అవుతోంద న్నారు. సమావేశాల్లో మాట్లాడేందుకు చిన్న పార్టీలకు, ఒక్క ఎంపీ ఉన్న పార్టీలకు కూడా 7 నిమిషాలు కేటాయించాలని మీటింగ్ లో కోరామన్నారు. విభజన హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశామన్నారు.