హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగానికి ప్రమాదకరమైన మనువాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు లెఫ్ట్ నేతలు పిలుపునిచ్చారు. మనువాదుల పాలన నుంచి రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించుకుందామన్నారు. మంగళవారం హైరదాబాద్లోని ఓంకార్ భవన్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ‘మనువాదం రాజ్యాంగం’అనే అంశంపై ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులను రక్షించడానికి చట్టసభల్లో ఓంకార్ తన గళాన్ని వినిపించేవారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు కుల, మత రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు.