
హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుద్దామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. డ్రగ్స్ను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ముందుగా డ్రగ్స్ నియంత్రణపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
లా అండ్ ఆర్డర్ పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపైనా దృష్టి పెట్టాలని సూచించారు. తప్పు చేసిన వారిపై కఠినంగా ఉండాలని, డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లపై నిఘా కొనసాగించాలని, పబ్స్, బార్లు, రిసార్ట్స్,రేవ్ పార్టీలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్కూల్స్, కాలేజీల్లో 5 మంది మెంబర్లతో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి పేరెంట్స్ లో అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు, ప్రజలతో మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కేసుల ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా ఉండాలని, పెండింగ్ కేసులు ఉండొద్దని స్పష్టంచేశారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు ఉండాలన్నారు. ట్రాఫిక్ పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ శివప్రసాద్, జాయింట్లు సీపీ గజారావు భూపాల్, పరిమళ హన నూతన్, ఎం.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.