
న్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం (జూలై 16) సెంట్రల్ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రి మండలి. వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడంలో భాగంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీనితో పాటు పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి మండలి సమావేశ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్కు కేబినెట్ పచ్చజెండా ఊపిందని తెలిపారు. ఈ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
ALSO READ : జలశక్తి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష్యంగా లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, పంట కోత తర్వాత నిల్వలను బలోపేతం చేయడం, నీటిపారుదల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణ లభ్యతను పెంచడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యమని వివరించారు అశ్వినీ వైష్ణవ్.
అలాగే ఎన్టీపీసీకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తిరిగి వచ్చిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాకు కేబినెట్ అభినందనలు తెలిపింది. ఈ మేరకు శుభాంశు శుక్లాను అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.