జలశక్తి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ : తెలంగాణ అంశాలు ఇవే

జలశక్తి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ : తెలంగాణ అంశాలు ఇవే

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి కేటాయింపులు, వాటాలు, కొత్త ప్రాజెక్టుల అంశంపై ఢిల్లీలో కీలక సమావేశం.. 2025, జూలై 16వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో.. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు. వీరితోపాటు తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామానాయుడు కూడా హాజరయ్యారు ఈ సమావేశానికి. తెలంగాణ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సైతం ఈ సమావేశంలో.. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ను కలిశారు.

తెలంగాణ ఎజెండాలోని కీలక అంశాలు ఇవే :

1. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి. 
2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి.
3. ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు  సహకరించేలా కృష్ణ ట్రిబ్యునల్ లో మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలి.
4. కృష్ణానది జలాలను వేరే బేసిన్ కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. కృష్ణా జలాలను అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ఒప్పుకోవాలి.
5. తుంగభద్ర బోర్డు నీటి తరలింపు పై చర్చించాలి.

6. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి . ఆ మేరకు పునరుద్ధరణ జరపాలి . ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి.
7. శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపు  ను నియంత్రించాలి.
8. శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర  నిర్మాణాలను నియంత్రించాలి 
9. శ్రీశైలం డ్యాం సేఫ్టీ కి తగిన చర్యలు తీసుకోవాలి.
10. శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది దీనిని అడ్డుకోవాలి.

11. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం  నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరి కి గోదావరి జలాల తరలింపుకు మేము సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలి. 
12. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి.
13.ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబిపి కింద నిధులు ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే  చర్చలు జరిపి తుమ్మిడి హట్టి  వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలి.

మరో వైపు ఏపీ మాత్రం పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని ఎజెండాగా చర్చించాలని కోరింది.