ట్రాఫిక్ చలాన్లు మూడు నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్! : రాష్ట్ర రవాణా శాఖ

ట్రాఫిక్ చలాన్లు మూడు నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్! :  రాష్ట్ర రవాణా శాఖ
  • ట్రాఫిక్ రూల్స్​ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
  • కసరత్తు మొదలెట్టిన రవాణా శాఖ
  • పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్​
  • త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం  
  • 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 18 ,978 మంది లైసెన్స్‌‌‌‌లు రద్దు

హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్​ రూల్స్‌‌‌‌ను తరుచూ​ బ్రేక్​ చేస్తున్న వాహనదారులపై కొరడా ఝులిపించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది.  సీసీ టీవీ ఫుటేజీలకు చిక్కుతున్నా, వేలకు వేలు ఫైన్లు పడ్తున్నా మళ్లీ తప్పుల మీద తప్పులు చేస్తున్న వారికి  చెక్​పెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వరుసగా 3 నెలలపాటు ట్రాఫిక్​ చలాన్లు పెండింగ్​పెట్టినవారి  డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లను సస్పెండ్ చేయాలని భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి తాజాగా వచ్చిన ప్రతిపాదనలపై  రవాణా శాఖ సీరియస్‌‌‌‌గా దృష్టిపెట్టింది. 

2 జిల్లాల పరిధిలోనే 10 వేల లైసెన్స్‌‌‌‌లు సస్పెండ్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్తున్న వాహనాదారులపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 25 వరకు 18, 973 మంది డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లను సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు.  ఇందులో డ్రంకెన్​ డ్రైవ్​లో చిక్కినవారు, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసిన వాహనదారులు ఉన్నట్లు  వెల్లడించారు. సుమారు 10 వేల మందికిపైగా హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందినవారే  కావడం గమనార్హం. 

మరోవైపు ట్రాఫిక్​రూల్స్​ ఉల్లంఘిస్తున్న చాలా మంది చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చలానా జనరేట్​అయిన తర్వాత ట్రాఫిక్​పోలీసుల నుంచి వాహనదారుల నంబర్లకు మెసేజ్​పంపుతున్నారు. కానీ కొందరు వాహనాదారులు నెలలు, ఏండ్ల కొద్దీ ఫైన్లు చెల్లించడం లేదు.  ఎప్పుడైనా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఒక్కోవాహనంపై వేల రూపాయల ఫైన్లు ఉంటున్నాయి.  ఇలాంటి సందర్భాల్లో  ఆ మొత్తం కట్టలేక తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారని పోలీసులు చెప్తున్నారు.  

లైసెన్స్ ​సస్పెన్షన్‌‌‌‌పై సర్కారుకు నివేదిక 

ట్రాఫిక్ రూల్స్​ బ్రేక్​ చేస్తున్నవారిని గాడినపెట్టాలంటే ఎప్పటికప్పుడు ఫైన్లు వసూలు చేయాలని ట్రాఫిక్​ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఒక్కో వాహనదారుడి బండిపై 3 నెలలకు పైగా ఫైన్లు పెండింగ్‌‌‌‌లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లను సస్పెండ్ చేయించాలనే ప్రతిపాదనను రవాణా శాఖ అధికారుల ముందు ఉంచారు.  ట్రాఫిక్ పోలీసుల నుంచి అందించిన ప్రపోజల్స్​ సాధ్యాసాధ్యాలపై  రవాణా శాఖ ఉన్నతాధికారులు త్వరలో నివేదిక రెడీ చేసి సర్కారుకు అందజేయనున్నట్లు తెలిసింది. ఇది గనుక అమలైతే ట్రాఫిక్​రూల్స్​ అతిక్రమించేవారికి కళ్లెం వేయడంతోపాటు ఫైన్లను ఎప్పటికప్పుడు క్లియర్​చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.