అనకాపల్లిలో నడిరోడ్డుపై బోల్తా పడ్డ మద్యం వాహనం.. మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

అనకాపల్లిలో నడిరోడ్డుపై బోల్తా పడ్డ మద్యం వాహనం.. మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

మద్యం లోడ్‎తో వెళ్తోన్న వాహనం అదుపు తప్పి నడిరోడ్డుపై బోల్తా పడింది. దీంతో వాహనంలోని మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇదే అదునుగా భావించిన స్థానికులు మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. పోటీ పడి మరీ మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఎవరికి అందినకాడికి వాళ్లు దోచుకుపోయారు. 

ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అరిపాలెం గ్రామం వద్ద బుధవారం (జూన్ 25) ఉదయం చోటు చేసుకుంది. మద్యం లోడ్‎తో వెళ్తున్న వాహనం బోల్తా పడటంతో స్థానికులు మందు బాటిళ్లను పోటీ పడి మరీ ఎత్తుకెళ్లారు. కార్టన్‎లకు కార్టన్లు తీసుకుని పారిపోయారు. మద్యం సీసాల కోసం స్థానికులు ఎగబడటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టారు. వాహనాల రద్దీని క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎంత నష్టం కలిగింది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల మద్యం సీసాల కోసం ఎగబడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ వీడియోలు చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.