చట్నీలో బల్లులు.. కర్రీలో ఈగలు..అధ్వానంగా హోటల్స్‌‌ నిర్వహణ

చట్నీలో బల్లులు.. కర్రీలో ఈగలు..అధ్వానంగా  హోటల్స్‌‌ నిర్వహణ
  • జనగామలో చట్నీలో కనిపించిన బల్లి
  • హోటల్‌‌ నిర్వాహకుడికి రూ. 10 వేలు ఫైన్‌‌, హోటల్‌‌ సీజ్‌‌
  • కరీంనగర్‌‌లో పూరీ కర్రీలో ఈగ
  • ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన మున్సిపల్ ఆఫీసర్లు 

కరీంనగర్/జనగామ, వెలుగు : అత్యాశకు అలవాటుపడిన హోటల్‌‌ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా కర్రీ, సాంబార్‌‌లో ఈగలు, బల్లులు దర్శనమిస్తున్నాయి. బుధవారం కరీంనగర్‌‌ బస్టాండ్ సమీపంలోని మయూర హోటల్‌‌లో చేసిన పూరీ కర్రీలో ఈగ కనిపించగా, జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌‌ సమీపంలో ఉన్న సాయి కృష్ణ హోటల్‌‌లోని చట్నీలో బల్లి దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళ్తే... జనగామకు చెందిన సిరాజుద్దీన్‌‌ బుధవారం స్థానిక రైల్వేస్టేషన్‌‌ సమీపంలోని సాయికృష్ణ హోటల్‌‌లో వడ పార్శిల్‌‌ తీసుకొని ఇంటికి వెళ్లాడు.

పిల్లలు వడ తింటుండగా చట్నీలో బల్లి కనిపించింది. సిరాజుద్దీన్‌‌ దానిని తీసుకొని హోటల్‌‌కు వచ్చి నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమివ్వడమే కాకుండా అది ఆకుకూర అని దబాయించారు. దీంతో బాధితుడు కడిగి చూపించినప్పటికీ ఒప్పుకోకుండా దానిని తీసుకొని బయట పడేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని వీడియో తీసిన బాధితుడు స్థానిక పోలీసులతో పాటు ఫుడ్‌‌ సేఫ్టీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు.

ఇదే సమయంలో రైల్వే స్టేషన్‌‌ ఆవరణలో ఫ్లాగ్‌‌మార్చ్‌‌ కోసం ఉన్న డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండరి చేతన్‌‌ నితిన్‌‌ హోటల్‌‌ను తనిఖీ చేసి నిర్వాహకులను మందలించారు. బాధితుడి ఫిర్యాదుతో హోటల్‌‌కు చేరుకున్న ఫుడ్‌‌ సేఫ్టీ ఆఫీసర్‌‌ వినీల్‌‌, మున్సిపల్‌‌ శానిటరీ ఇన్స్‌‌పెక్టర్‌‌ పులి శేఖర్‌‌ హోటల్‌‌ నిర్వాహకులకు రూ.10 వేల ఫైన్‌‌ విధించి, రెండు రోజులు హోటల్‌‌ బంద్‌‌ పెట్టాలని ఆదేశిస్తూ సీజ్‌‌ చేశారు.

కరీంనగర్‌‌లో పూరీ కర్రీలో ఈగ

కరీంనగర్‌‌ పట్టణంలోని భగత్‌‌నగర్‌‌కు చెందిన భాస్కర్, శ్రీనివాస్‌‌ టిఫిన్‌‌ చేసేందుకు బుధవారం బస్టాండ్‌‌ సమీపంలోని మయూర హోటల్‌‌ ఏసీ సెక్షన్‌‌లోకి వెళ్లారు. పూరి ఆర్డర్‌‌ ఇవ్వగా కర్రీలో చనిపోయిన ఈగ కనిపించింది. సిబ్బందిని నిలదీయగా.. ఈగే కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారు మున్సిపల్‌‌ అసిస్టెంట్‌‌ కమిషనర్ జక్కుల సువార్తకు ఫోన్‌‌ చేసి విషయం చెప్పగా... ‘ఒక పని చేయండి.. ఈగ వచ్చిన విషయాన్ని పేపర్‌‌లో వేయించండి’.

అంటూ సలహా ఇచ్చారని బాధితులు వాపోయారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్స్‌‌పై చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.