2 లక్షల మంది వీధి వ్యాపారులకు లోన్లు-కిషన్ రెడ్డి

2 లక్షల మంది వీధి వ్యాపారులకు లోన్లు-కిషన్ రెడ్డి

అప్లై చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచన

 రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూస్తాం

 పత్తి కొనుగోళ్లకు సిద్ధమవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రెండు లక్షల మంది స్ట్రీట్​ వెండర్లకు లోన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించానని, అవసరమైన వాళ్లంతా అప్లై చేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద ఇంత వరకూ స్టేట్ గవర్నమెంట్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయిస్తున్నామని చెప్పిందని అన్నారు. సబ్సిడీ ఇంటి రుణాల కోసం లక్షకుపైగా అప్లికేషన్లు తీసుకుని, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, వాటిని వెంటనే క్లియర్ చేయాలని రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 168 బస్తీ దవాఖాన్ల(వెల్‌‌‌‌‌‌‌‌ నెస్ సెంటర్లు)ను కేంద్రం మంజూరు చేసిందని, వాటికి నిధులు కూడా ఇస్తోందని కిషన్​ రెడ్డి చెప్పారు. కేంద్ర నిధులతో కొన్ని మొదలయ్యాయని, మిగిలిన వాటిని వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ విషయంపై హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్లను సంప్రదించగా తమకు సంబంధం లేదంటున్నారని, హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ వాళ్లతో చర్చిస్తానని కిషన్​రెడ్డి తెలిపారు.

తేమ లేకుండా చూసుకోండి

ఈసారి పత్తి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, గతేడాది 11,651 టన్నులు కొనుగోలు చేశామని, ఈసారి కూడా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని సీసీఐని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. గతేడాదికి సంబంధించిన 45 లక్షల బేళ్ల కాటన్‌‌‌‌‌‌‌‌ గోడౌన్లలో ఉండడం వల్ల ఇప్పుడొచ్చే పంటను స్టోర్ చేయడానికి గోడౌన్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు జిన్నింగ్ మిల్స్‌‌‌‌‌‌‌‌కి అవకాశం ఇస్తామని, టెండర్లలో పాల్గొనాలని మిల్లర్లకు సూచించారు. పత్తిలో తేమ లేకుండా రైతులు చూసుకోవాలని సూచించారు. పంట కేంద్రాల దగ్గరే రైతులకు టోకెన్స్ ఇస్తామని, దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయొద్దని కేంద్రం నిర్ణయించిందన్నారు. అక్టోబర్ 10 లోపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

యూరియా తెప్పిస్తం

కరోనాతో పరిశ్రమలు మూతపడడం వల్ల యూరియా ఉత్పత్తి తగ్గిందని, ఇతర దేశాల నుండి రావాల్సిన యూరియా కూడా ఆలస్యమైందని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా అందిస్తామని, ఇప్పటికే రాష్ట్రంలో స్టాక్ ఉందని, విదేశాల నుండి రెండు షిప్స్‌‌‌‌‌‌‌‌లో యూరియా వస్తోందని తెలిపారు. రాష్ట్ర రైతులకు అవసరమైన యూరియా వచ్చేలా చేస్తానన్నారు. ఫెడరల్ సిస్టంలో అంతా కలిసికట్టుగా ముందుకెళ్లాలని, జీఎస్టీ విషయంలో అందరూ ఆలోచించాలన్నారు. కేంద్రం దగ్గర నిధులు ఉండి రాష్ట్రాలకు ఇవ్వకపోతే నిందించవచ్చని, కేంద్రం కూడా ఇబ్బందుల్లో ఉందని, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని కిషన్​రెడ్డి చెప్పారు.