
మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి భూగర్భ గనులకు లాక్ డౌన్ ప్రకటించాలని, కార్మికులందరికి ఏరియా ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో కరోనా టెస్ట్లు చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలోని పలువురు కార్మికులు, అధికారులకు వచ్చిందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
కార్మికులకు కరోనా టెస్ట్లు చేయడానికి హైదరాబాద్లోని విమ్టా ల్యాబ్ వారితో ఒప్పందం చేసుకున్నా ఇప్పటికీ పరీక్షలు ప్రారంభించలేదన్నారు. హైదరాబాద్లోని మూడు ఆసుపత్రుల్లో పాజిటివ్ వచ్చిన కార్మికులు, వారి కుటుంబ సభ్యు లకు చికిత్స చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నా… అక్కడ పరిమిత సంఖ్యలోనే బెడ్లను కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ఏరియా ఆసుపత్రులతోపాటు ఐసోలేషన్ కేంద్రాలలో పనిచేసే అందరికి రూ.50 లక్షల ఇన్సూరెన్సు వర్తింపచేయాలని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా వేతనాలపై 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని, సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా ఐసోలేషన్ సెంటర్లను ఏరియా హాస్పిటళ్లలో కాకుండా బయట ఏర్పాటు చేయాలని, స్టాఫ్ ను కూడా ప్రత్యేకంగా నియమించాలన్నారు. పాజిటివ్ వచ్చిన కార్మికులు కోలుకునేంత వరకు వారికి ప్రత్యేక లీవులు మంజూరు చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.