నీట్ రగడ.. జూలై 1కి లోక్ సభ వాయిదా

నీట్ రగడ.. జూలై 1కి లోక్ సభ వాయిదా

నీట్ పై రచ్చతో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే  వాయిదా తీర్మానాలపై విపక్ష ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. అయితే తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. రాష్ట్రపతి ప్రసంగానికి తీర్మానంపై చర్చ జరగాలన్నారు. నీట్ అంశం చాలా ముఖ్యమని విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ కు భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్లమెంట్ పై ఉందని చెప్పారు. స్పీకర్ చెప్పినా వినకుండా.. నీట్ పై విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. సభలో గందరగోళంతో మొదటి సారి సభను 12 గంటలకు వాయిదా వేశారు. 

లోక్ సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నీట్ పై చర్చకు పట్టుబట్టారు. అయితే ముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాలన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ప్రభుత్వం అన్ని అంశాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. కానీ నీట్ పై వెంటనే చర్చించాలని విపక్ష ఎంపీలు కోరారు. ఈక్రమంలో మరోసారి గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు.