అదిగో చంద్రుడు.. చంద్రయాన్2 తొలి ఫొటో పంపింది

అదిగో చంద్రుడు.. చంద్రయాన్2 తొలి ఫొటో పంపింది

ఇస్రో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చంద్రయాన్ 2 జాబిల్లికి చేరువవుతోంది. చందమామ కక్ష్యలో తిరుగుతూనే.. ఫొటోలు తీసి పంపిస్తోంది. భూమి కక్ష్యలో ఉన్నప్పుడు భూమిని కూడా పలు కోణాల్లో ఫొటోలు తీసి పంపింది చంద్రయాన్ 2 లోని విక్రమ్ ల్యాండర్. వాటిని ఇస్రో విడుదల చేసింది. తాజాగా… చంద్రుడికి సంబంధించి.. విక్రమ్ ల్యాండర్ తీసిన ఫొటోను ఇస్రో విడుదల చేసింది.

చంద్రుడి ఉపరితలం నుంచి 2,650 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఫొటోలను తీసింది విక్రమ్ ల్యాండర్. ఆగస్ట్ 21న విక్రమ్ ల్యాండర్ ఈ ఫొటోలు తీసిందని ఇస్రో తెలిపింది.

చంద్రుడికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలు గుర్తించిన ప్రదేశాలను విక్రమ్ ల్యాండర్ నోట్ చేసింది. చంద్రుడిపై గుర్తించిన అపోలో క్రేటర్(భారీ బిలం), మేర్ ఓరియంటల్ బేసిన్ ప్రాంతాలను విక్రమ్ ల్యాండర్ ఫొటో తీసింది.

చంద్రుడి దక్షిణ భాగంలో నాసా చేసిన అపోలో మూన్ మిషన్ తో ఈ బిలాన్ని గుర్తించారు. 538 కిలోమీటర్ల విశాలమైన ఈ భారీ బిలానికి…  అపోలో క్రేటర్ అని అప్పుడే పేరు పెట్టారు. ఈ అపోలో అనే పెద్ద బిలంలోనే… మరెన్నో క్రేటర్స్ ఉన్నాయని గుర్తించారు. వాటికి ఇప్పటికే చనిపోయిన నాసా ఆస్ట్రోనాట్స్, అధికారుల పేర్లు పెట్టేశారు. కొలంబియా వ్యోమనౌక సిబ్బంది పేర్లతో ఏడు చంద్రబిలాలకు  నామకరణం చేశారు.

Mare Orientale బిలం .. విక్రమ్ ల్యాండర్ తీసిన ఫొటోలో ఉంది. ఇది అపోలోకు మరోవైపున ఉన్న ప్రాంతం. ఈ లోయ ప్రాంతం.. 950 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. గ్రహశకలం చంద్రుడిని తాకడంతో … 3 బిలియన్ల ఏళ్ల కిందటే ఇది ఏర్పడినట్టు చెబుతున్నారు. కొంత దూరం నుంచి చూస్తే ఇది కన్ను లాగా కనిపిస్తుందని నాసా తెలిపింది.