- 16 రోజుల తర్వాత గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు
- ఖతార్ నుంచి 45 వేల టన్నుల గ్యాస్ను మోసుకొచ్చిన ఎల్పీజీ ట్యాంకర్ షిప్
- మరో 46 వేల టన్నుల గ్యాస్తో భారత్లో ప్రవేశించిన ‘నందా దేవి’
- 80 వేల టన్నుల క్రూడ్ ఆయిల్తో వస్తున్న ‘జగ్ లాడ్కీ’
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న ఇంధన సరఫరా ఆందోళనకు కాస్త ఉపశమనం లభించింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘శివాలిక్’ ఎల్పీజీ ట్యాంకర్.. హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు చేరుకున్నది.
ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుంచి బయలుదేరిన ఈ షిప్ హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఈ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా ఇండియన్ నేవీ వచ్చింది. గత నెలలో ఇరాన్పై అమెరికా–--ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు యుద్ధానికి దారితీసిన తర్వాత, హార్మూజ్ జలసంధిని దాటి భారత్కు చేరుకున్న రెండో ట్యాంకర్గా శివాలిక్ నిలిచింది.
సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో వచ్చిన లైబీరియన్ పతాక ట్యాంకర్ మొట్టమొదటగా ఇక్కడికి చేరుకున్నది. దీంతో పాటు ‘నందా దేవి’ అనే మరో ట్యాంకర్ కూడా హార్మూజ్ జలసంధిని దాటిందని, ఇది మంగళవారం ముంబై తీరానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కూడా రాస్ లఫాన్ నుంచి బయలు దేరింది. ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. ఈ నౌక దాదాపు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి.
అలాగే, ఒమన్ నుంచి ఆఫ్రికాకు గ్యాసోలిన్ తీసుకెళ్తున్న ‘జగ్ ప్రకాశ్’ అనే నాలుగో భారతీయ ట్యాంకర్ కూడా జలసంధి తూర్పు వైపు నుంచి బయలుదేరిందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు. 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో వస్తోన్న ‘జగ్ లాడ్కీ’ నౌక మంగళవారం భారత్కు చేరుకుంటుందని చెప్పారు. అలాగే పర్షియన్ గల్ఫ్కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిల్లో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు.
ఫలించిన భారత్ దౌత్యం
భారతీయ ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం వెనుక తీవ్రమైన దౌత్య ప్రయత్నాలు ఉన్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తో నాలుగు రౌండ్ల చర్చలు జరిపారు. అలాగే, గతవారం ప్రధాని నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడారు. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ పేర్కొంది. ఈ క్రమంలో రెండు భారత ఎల్పీజీ నౌకలు రెండ్రోజుల క్రితం సేఫ్గా హార్మూజ్ జలసంధిని దాటాయి.
