హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ ఆస్తులు తొమ్మిదేండ్లలోనే 424 శాతం పెరిగాయని, అదెట్ల సాధ్యమైందని పీసీసీ ప్రచా ర కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. శ్రీకాంతా చారి వంటి వాళ్ల బలిదానాలతో రాష్ట్రం వస్తే.. డైరెక్ట్గా మంత్రి అయిన కేటీఆర్ కంపెనీలను స్థాపించి సంపదను పెంచుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఆస్తులు పెరిగాయే తప్ప.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు. చాలా తక్కువ టైంలోనే కేసీఆర్, హరీశ్రావు, కవిత, కేటీఆర్, సంతోష్రావుల ఆస్తులే వేలకోట్లకు పెరిగాయన్నారు. దుబాయ్ శేఖర్గా గుర్తింపు పొందిన కేసీఆర్.. ఓ చిన్న ఇంట్లో ఉండేవారని అన్నారు.
కానీ, ఇప్పుడు కేటీఆర్ ప్రైవేటు విమానంలో అమెరికా టూర్కు వెళ్తున్నారని చెప్పారు. అదంతా ఎవరి సొమ్ము, ఏ కంపెనీ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుడు బడ్జెట్లో దళితబంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించి.. ఎంతమందికి ఇచ్చారో కేటీఆర్ చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ భాయీ భాయీ అని అన్నారు. కవిత లిక్కర్ కేసుకు సంబంధించి చార్జిషీట్లో కవిత పేరున్నా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చేందుకు కేసీఆర్ కోట్లు కుమ్మరించారన్న ఆరోపణలు వస్తున్నాయని విమర్శించారు.
రాహుల్పై కక్షసాధింపు ఆపాలె: కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిటిషన్ను గుజరాత్ హైకో ర్టు కొట్టేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మోదీ దిష్టి బొమ్మలను తగులబెట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.