రాత్రయితే  కమ్మేస్తున్న  పొగ!... సాయంత్రమైందంటే మడికొండ డంప్​ యార్డు చెత్తకు నిప్పు

రాత్రయితే  కమ్మేస్తున్న  పొగ!... సాయంత్రమైందంటే మడికొండ డంప్​ యార్డు చెత్తకు నిప్పు
  •      చుట్టుపక్కల ఊళ్లకు వ్యాపిస్తుండటంతో ఇబ్బందులు
  •      డెడ్​ స్లోగా నడుస్తున్న బయో మైనింగ్​ ప్రక్రియ
  •      రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా వదలని సమస్య

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగర ప్రజలకు మడికొండ డంప్​ యార్డు శాపంగా మారింది. రెండేండ్ల కిందట చేపట్టిన బయో మైనింగ్​ ప్రక్రియ   స్లోగా నడుస్తుండటం, చెత్తను శుద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టులు కాగితాల దశ దాటకపోవడం సమస్యగా మారగా.. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకు అక్కడి సిబ్బంది రోజూ సాయంత్రం నిప్పు పెడుతున్నారు. ఫలితంగా రాత్రి 8 దాటిందంటే ఆ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల ప్రజలు పొగ ఘాటుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బయోమైనింగ్ కాలే.. ప్రాజెక్టులు పట్టాలెక్కలే

వరంగల్​ నగరంలోని 66 డివిజన్ల పరిధిలో 2.25 లక్షల ఇండ్లు ఉండగా.. సుమారు 11 లక్షల జనాభా నివసిస్తోంది. రోజువారీగా తడి, పొడి చెత్త అంతా కలిపి 450 నుంచి 500 టన్నుల వరకు వెలువడుతోంది. ఈ చెత్తనంతా మడికొండ-రాంపూర్​ గ్రామాల సమీపంలోని డంప్​ యార్డుకు తరలిస్తుండగా.. ఇప్పటికే అక్కడ ఆరు లక్షల మెట్రిక్​ టన్నులకుపైగా చెత్త పోగైంది. దీంతో అక్కడున్న దాంట్లో 3 లక్షల టన్నులను శుద్ధి చేసేందుకు రెండేండ్ల కిందట 2021లో స్మార్ట్​ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.37 కోట్లతో బయో మైనింగ్​ చేపట్టారు.

ఏడాదిలోనే బయో మైనింగ్​ పూర్తి కావాల్సి ఉండగా.. బిల్లులు, వర్షాలు తదితర సమస్యల కారణంగా ఇప్పటివరకు 1.87 లక్షల టన్నుల చెత్త మాత్రమే శుద్ధి చేశారు. డైలీ ఇక్కడ  2 వేల టన్నులే ప్రాసెస్​ అవుతుండగా.. రోజువారీగా పోగవుతున్న చెత్తతో డంప్​ యార్డు నిండిపోతోంది. జీడబ్ల్యూఎంసీలో వెలువడుతున్న చెత్తకు పరిష్కారం చూపేందుకు గతంలో వివిధ రకాల ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆఫీసర్లు ప్రణాళికలు రూపొందించారు. బయో మైనింగ్​ కు సమాంతరంగా చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే ప్రాజెక్టుకు మూడేండ్ల కిందటే ప్రపోజల్స్​ రెడీ చేశారు.

ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ గాల్వనైజింగ్ ఆర్గానిక్​ బయో-ఆగ్రో రీసోర్సెస్​ ధన్(గోబర్​ ధన్)​ స్కీం కింద బయో గ్యాస్​ ప్లాంట్లు ఏర్పాటుకు కసరత్తు చేశారు. అవేవీ పట్టాలెక్కలేదు. ఈ క్రమంలోనే పది రోజుల కిందట దక్షిణ కొరియాకు చెందిన సేజింగ్ అనే కంపెనీ ల్యాండ్ ఫిల్​ గ్యాస్​ ద్వారా చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తికి ముందుకొచ్చింది. కానీ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత చెత్త ప్రాసెసింగ్, విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని చెప్పింది. దీంతో ఆ ప్రక్రియ మొదలవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. 

రాత్రయ్యిందంటే చుట్టూ పొగే

చెత్త ప్రాసెసింగ్​కు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కపోవడం, కొత్తగా జమవుతున్న వ్యర్థాలతో మడికొండ డంప్​ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో అక్కడి సిబ్బంది చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఫలితంగా రాత్రి 8 దాటిందంటే చాలు డంప్​ యార్డు నుంచి వచ్చే పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేస్తోంది. బుధవారం రాత్రి కూడా ఇలాగే నిప్పుపెట్టడంతో ఆ పొగ మడికొండ, రాంపూర్​, ఎలుకుర్తి, ధర్మసాగర్​ వరకూ  వ్యాపించింది.

ఫలితంగా ఘాటు వాసనలతో అక్కడి జనాలు, శ్వాస కోష వ్యాధులున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగ వల్ల రింగ్​ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు  డంప్​ యార్డును ఆనుకుని ఉన్న మినీ టెక్స్​ టైల్​ పార్క్​ కార్మికులు రాత్రయితే ముక్కు మూసుకుని పని చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కాగా డంప్​ యార్డును అక్కడి నుంచి తరలించడమో లేదా సమస్యకు పరిష్కారం చూపడమో చేయాలని ఆ చుట్టుపక్కల ప్రజలు కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు రోడ్డెక్కి ఆందోళనలు కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇకనైనా డంప్​ యార్డు సమస్యకు పరిష్కారం చూపాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పొగ ఊరంతా కమ్మేస్తాంది

డంప్​ యార్డు నుంచి వచ్చే పొగ మా ఊరిని కమ్మేస్తాంది. ఆ ఘాటు వాసనల వల్ల దగ్గు, దమ్ము రావడమే కాకుండా శ్వాసకు కూడా ఇబ్బంది అయితాంది. ఎండాకాలం గాలి కోసం బయట ఉండే పరిస్థితి లేకుండా పోతాంది. డంప్​ యార్డును ఊళ్లకు దూరంగా తరలించాలి. 
- కొలిపాక కుమారస్వామి, ఎలుకుర్తి

సాయంత్రమైతే పొగ మసకే

 సాయంత్రమైతే చాలు డంప్​ యార్డు పొగ మాదాకా వస్తోంది. ఈ మధ్య ప్రతిరోజు ఇదే సమస్యే ఎదురవుతోంది. డంప్​ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని చాలాసార్లు విన్నవించినం. అయినా ఎవరూ పట్టించుకుంటలేరు.
-  గడ్డం నవీన్​, మోడల్​ కాలనీ, ధర్మసాగర్​