ఎన్టీఆర్ సినిమా ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సౌత్ హీరోకు జంటగా ఆమె అవకాశం అందుకున్నట్టు తెలుస్తోంది. సూర్య హీరోగా బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు.
మహాభారతం ఆధారంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో సూర్యకు జంటగా జాన్వీకపూర్ను ఎంపిక చేసినట్టు బాలీవుడ్ టాక్. ఇదే నిజమైతే జాన్వీ కెరీర్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్టే. ఇక ఇటీవలే ‘కంగువ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసిన సూర్య.. సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక రాకేష్ ఓం ప్రకాష్ సినిమా ఉండనుంది. ఇందులో కర్ణుడి పాత్రను సూర్య పోషించనున్నట్టు సమాచారం.