
- రూ.120 కోట్లకు ఇప్పటి వరకు రూ.60 కోట్ల బిల్లుల చెల్లింపులు
- బిల్లుల మంజూరులో ఆలస్యంతో కాంట్రాక్టర్ కు తప్పని ఇబ్బందులు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు నాలుగేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలికంగా నర్సింగ్ కాలేజీ బిల్డింగ్లో వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీ ప్రారంభమై మూడేండ్లు కాగా, నాలుగో ఏడాది క్లాసులు వచ్చే నెలలో మొదలుకానున్నాయి. దీంతో 2025–26 విద్యా సంవత్సరానికైనా పనులు పూర్తి చేసి మెడికల్ కాలేజీ బిల్డింగ్ను అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.
బిల్లుల ఆలస్యంతో ముందుకు సాగని పనులు..
మహబూబాబాద్ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు చేస్తున్నా, సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆశించిన స్థాయిలో స్పీడ్ అందుకోవడం లేదు. మెడికల్ కాలేజీ, హాస్టల్బిల్డింగ్ల నిర్మాణం కోసం మొత్తంగా మంజూరైన నిధులు రూ.120 కోట్లు, కాగా, ఇప్పటి వరకు పూర్తయిన పనులకు చెల్లించిన బిల్లులు రూ.60 కోట్లు, చేసిన పనులకు ఇంకా చెల్లించాల్సిన బిల్లు సుమారుగా రూ.30 కోట్లు వరకు ఉంటుంది. సకాలంలో బిల్లులు అందకపోవడంతో పనులు చేయలేకపోతున్నట్లు కాంట్రాక్టర్ చెబుతున్నారు.
కాగా, బాయ్స్కి మూడు బ్లాకులు, గర్ల్స్కి మూడు బ్లాక్ ల్లో హాస్టల్ భవన నిర్మాణం పనులు 90 శాతం పూర్తయ్యాయి. వైద్య విద్యా బోధనకు జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 450 మంది వైద్య విద్యార్థులు ఉండగా, వచ్చే ఏడాదిలో 150 మంది విద్యార్థులు ప్రవేశం పొందనున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలో వైద్య విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించారు. కాలేజీకి, ప్రస్తుతం విద్యార్థులు ఉంటున్న అద్దె భవనం 4 కిలో మీటర్లు ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.
తరగతి గదులు రెండే, లైబ్రరీలోనూ బోధన..
ప్రస్తుతం వైద్య విద్య బోధనకు రెండు గదులు మాత్రమే ఉన్నాయి. మూడో ఏడాది విద్యార్థులకు లైబ్రరీలో బోధన చేస్తున్నారు. వైద్య విద్యార్థులు అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో మొదటి సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశం పొందనున్నారు. దీంతో సమస్యలు మరింతగా పెరుగనున్నాయి.
బిల్లుల చెల్లింపు కోసం చర్యలు చేపడుతాం
మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల బిల్లుల చెల్లింపు కోసం కృషి చేస్తున్నాం. పనుల ప్రగతిని బట్టి వెనువెంటనే బిల్లులు రికార్డ్ చేస్తున్నాం. హాస్టల్ బిల్డింగ్ పనులు ఫినిషింగ్ దశకు చేరుకున్నాయి. మేయిన్ బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ కు బిల్లులు రావడంలో కొంత ఆలస్యం అవుతుంది. వీలైనంత మేరకు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకు వెళ్తాం.
బీమ్లానాయక్, ఆర్అండ్బీ ఈఈ మహబూబాబాద్