అసెంబ్లీలో ఫూలే విగ్రహ ఏర్పాటుకు ఫిబ్రవరిలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత

అసెంబ్లీలో ఫూలే విగ్రహ ఏర్పాటుకు ఫిబ్రవరిలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత

 

  • బీసీల హక్కుల కోసం ఫూలే ఫ్రంట్ ​పెడ్తం
     

హైదరాబాద్, వెలుగు: బీసీల హక్కుల సాధన కోసం పోరాడుతానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకోసం భారత జాగృతి సమన్వయంతో యునైటెడ్​ఫూలే ఫ్రంట్​(యూపీఎఫ్) ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు ఉద్యమం ఇందులో ఆరంభం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్​లోని తన నివాసంలో పలువురు బీసీ సంఘాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం ఫిబ్రవరి రెండో వారంలో ధర్నా చౌక్​లో మహాధర్నా చేస్తామన్నారు.

ఈ ధర్నాకు బీసీ, ప్రజాసంఘాల నాయకులను ఆహ్వానిస్తామన్నారు. ఇదే డిమాండ్​తో ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీ మధ్య అన్ని జిల్లాలతో పాటు యూనివర్సిటీల్లో రౌండ్​టేబుల్​సమావేశాలు నిర్వహిస్తామన్నారు. విగ్రహ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి  జాగృతి, యూపీఎఫ్​ ప్రతినిధులం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఫూలే జయంతి (ఏప్రిల్​11వ తేదీ) లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తామన్నారు.