శివరాత్రి జాతరకు ఎములాడ ముస్తాబు

శివరాత్రి జాతరకు ఎములాడ ముస్తాబు
  • ఇప్పటికే వేలాదిగా చేరుకున్న భక్తులు 
  • ఏర్పాట్లు చేసిన అధికారులు 

వేములవాడ, వెలుగు: వేములవాడలో మహాశివరాత్రి జాతర నేడు ప్రారంభంకానుంది. జాతరకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే రాజన్న ఆలయంతో పాటు రాజన్న ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 3 లక్షల మంది తరలివస్తారన్న అంచనాతో గుడి చెరువు ప్రదేశంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, టాయిలెట్స్, బస్సులు,  దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

తిప్పాపూర్​ బస్టాండ్​ నుంచి గుడిచెరువు వరకు భక్తులను తరలించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 ఉచిత బస్సులను విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. భక్తుల కోసం గుడి చెరువు మైదానంలో ఉచిత అన్నదానం, ఉచిత  అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్​ మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఉచిత అన్నదానం అందుబాటులో ఉంటుందన్నారు. జాతర ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్​అనిల్​ కుమార్, కలెక్టర్​ అనురాగ్​ జయంతి, అడిషనల్​ కలెక్టర్​ పూజరి గౌతమి, ఎస్పీ అఖిల్​మహాజన్​, ఈవో కృష్ణ ప్రసాద్​ పర్యవేక్షించారు.  కాగా మహాశివరాత్రి సందర్భంగా శివ స్వాములు దీక్ష విరమించనున్నారు. 

6 గంటలకు మహాలింగార్చన..

శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు  అనువంశిక బ్రాహ్మణులచే మహా లింగార్చన, దర్శనం,  రాత్రి 11.35 లింగోద్భవ కాలం నందు స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొనాలనుకునే భక్తులు శ్రీభీమేశ్వరాలయంలో అభిషేకాలు చేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.