ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ , వెలుగు: అందరి సహకారంతో పాలమూరు పట్టణాన్ని  మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతానని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్  మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. మహబూబ్ నగర్ పట్టణం స్మార్ట్​సిటీగా ఎంపికైనందుకు మున్సిపల్ పాలకవర్గాన్ని అభినందించారు.  అనంతరం మాట్లాడుతూ మహబూబ్ నగర్ ను మహానగరం తీర్చిదిద్దడమే  ధ్యేయమన్నారు. త్వరలోనే నగర పాలక సంస్థగా మారుతోందని చెప్పారు. పట్టణంలో 2వ స్టేడియం నిర్మాణం చేపట్టామని, పాత స్టేడియంలో రాష్ర్ట స్థాయి క్రీడలు ఆడేందుకు తీర్చిదిద్దుతున్నామన్నారు.  అంతకుముందు ఆధునీకరించిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్​హాల్​ను మంత్రి ప్రారంభించారు.  అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, వైస్ చైర్మన్ గణేశ్, కమిషనర్​ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. 

నేడు వనపర్తికి కేంద్ర మంత్రి రాక

వనపర్తి/గద్వాల, వెలుగు : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే గురువారం వనపర్తి, గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నట్లు  బుధవారం బీజేపీ లీడర్లు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని  బీజేపీ ఆఫీస్​లో జరిగే పార్లమెంట్ ప్రవాసీ యోజన సన్నాహక సమావేశానికి హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు డా. ఏ.రాజ వర్ధన్ రెడ్డి, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  జింకల కృష్ణయ్య  మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి  శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తారని చెప్పారు. రాజనగరం రోడ్డు లోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో  మొదటిసారి ఓటు వేయనున్న యువ ఓటర్ల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతారన్నారు. గద్వాలకు మధ్యాహ్నం చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. 

నియోజకవర్గాన్ని మరిచిన ‘గువ్వల’

అచ్చంపేట, వెలుగు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 45 రోజులుగా ప్రగతి భవన్​కే అంకితమై నియోజకవర్గ ప్రజలను మరిచిపోయారని బీజేపీ నేత సతీశ్​మాదిగ విమర్శించారు. గురువారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెత్తిన రూపాయి పెడితే పావుల విలువ చేయని.. ‘గువ్వల’ను 100 కోట్లకు ఎవరు కొంటారని, అతడిపై సీఎం కేసీఆర్​కే నమ్మకం లేదన్నారు. పట్టుబడిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ వచ్చే ఎన్నికల్లో సీటు రాదన్నారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే టీఆర్ఎస్​చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.  

వనపర్తి లో 11 మీ సేవ కేంద్రాల రద్దు

వనపర్తి, వెలుగు: జిల్లాలో రూల్స్ కు విరుద్ధంగా జిల్లా అధికారులు కొత్తగా శాంక్షన్ చేసిన 11  మీసేవ కేంద్రాలను రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వివిధ మండలాల్లో కొత్త మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించారు. కానీ ఇందులో అవకతవకలు జరిగాయని ఒక్కో సెంటర్ ఏర్పాటు కు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి సెంటర్లు శాంక్షన్​చేసినట్లు సంబంధిత శాఖ కమిషనర్​కు కంప్లైంట్స్​వెళ్లాయి. విచారణ చేపట్టిన ఆఫీసర్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించి  జిల్లా  ఇన్​చార్జి ఈడీఎం వినోద్ కుమార్ ను తొలగించారు.

రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం

అచ్చంపేట, వెలుగు: మండల పరిషత్​సర్వసభ్య సమావేశం  బుధవారం రసాభాసగా ముగిసింది. అచ్చంపేట ఎంపీపీ శాంతాబాయి అధ్యక్షతన జరిగిన సమావేశంలో  టీఆర్ఎస్​సర్పంచ్​లు, ఎంపీటీసీలు పరస్పర దూషణలకు దిగారు. అధికారులు వివిధ అంశాలను సభ ముందు ప్రస్తావిస్తుండగా.. బొమ్మన్​పల్లి సర్పంచ్​ బోడ్కానాయక్​ ప్రతి విషయంలో కలుగ చేసుకుని మాట్లాడడం, ఇతర సర్పంచ్​లకు , ఎంపీటీసీలకు అవకాశం ఇవ్వక పోవడంతో ఎంపీటీసీ హరినాయక్​, సర్పంచ్​ లోక్యానాయక్​  బోడ్కానాయక్​తో వాగ్విదానికి దిగారు. ఎంపీపీ శాంతా బాయి, జడ్పీటీసీ మంత్ర్యానాయక్​ కూడా బోడ్కానాయక్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్​ఎస్సై  బాలరాజు మాట్లాడుతుండగా.. సభ్యులు మాట్లాడుతూ  అక్రమ బెల్లం తరలిస్తున్న వెహికిల్స్​ను పట్టుకుని లక్షల 
రూపాయల ఖరీదు చేసే వెహికిల్స్​ను సీజ్​ చేస్తున్నారని , అలా చేయవద్దని వాగ్వాదానికి దిగారు. వైస్​ ఎంపీపీ అమరావతి, ఎంపీడీవో , వివిధ శాఖల అధికారులు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

జోగులాంబ ఆలయాన్ని సందర్శించిన ఆర్కియాలజీ ఆఫీసర్లు

అలంపూర్, వెలుగు:  జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను బుధవారం ఆర్కియాలజీ రీజినల్ జాయింట్ డైరెక్టర్ మైసూర్ మహేశ్వరి, సూపరింటెండెంట్  స్మిత సందర్శించారు. ఈ సందర్భంగా నవ బ్రహ్మ  ఆలయాలపై కప్పు రిపేర్​పనులను,  జోగులాంబ ఆలయ పుష్కర ఘాట్ పక్కన గల ఖాళీ స్థలంలో అన్నదాన సత్రం ఏర్పాటు కు స్థల పరిశీలన చేశారు. ఈవో పురేందర్​కుమార్, ముఖ్య అర్చకులు డి. ఆనంద్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ రంగనాథ్ పాల్గొన్నారు. 

బోధనలో టీఎల్ఎం వినియోగించాలి

మరికల్​, వెలుగు: ప్రతీ ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయిని పెంచేందుకు కొత్త టీఎల్ఎం( టీచింగ్​లెర్నింగ్​మెటీరియల్) ను వినియోగించాలని, విద్యార్థుల ప్రగతిని రోజూ సమీక్షించి  బోధించాలని ఎడ్యుకేషన్​రీజినల్ డైరెక్టర్​విజయలక్ష్మి ఆదేశించారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ధన్వాడ మండల కేంద్రంలోని సంత బజార్ స్కూల్​లో టీచర్లు తయారు చేసిన టీఎల్​ఎం ను పరిశీలించారు.  స్టూడెంట్ల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టూడెంట్లను స్పీడ్ రీడింగ్ చేయించాలని, నిర్ధేశిత సమయం నిర్ణయించి ఆ లోగా ఎఫ్ఎల్​ఎన్​లో విద్యార్థుల ప్రగతిని పెంచి, డిసెంబర్ లోగా ప్రతీ విద్యార్థి 100 శాతం సామర్థ్యం సాధించేలా చూడాలన్నారు. మరికల్ గర్ల్స్​హైస్కూల్​లో  కాంప్లెక్స్ మీటింగ్​కు హాజరై మాట్లాడారు. గర్ల్స్​స్కూల్​లో  మధ్యాహ్న భోజనం పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్​ఆవరణలో అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. ఎస్​ఈఆర్టీ ప్రొఫెసర్​ రవికాంత్ మాట్లాడుతూ క్లాసుల వారీగా కాకుండా స్టూడెంట్ల స్థాయికి తగినట్లుగా ఎఫ్ ఎల్ ఎన్ అమలు చేయాలన్నారు. ఆర్​జేడీ వెంట  ఏఎంవో విద్యాసాగర్, సీఎంవో శ్రీనివాస్, ఎంఐఎస్​కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

వాల్మీకి బోయల పోరాటాన్ని గుర్తించాలి

వనపర్తి, వెలుగు: ఎన్నో ఏండ్లుగా బోయలు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని, సీఎం కేసీఆర్​వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్​రెడ్డి హెచ్చరించారు. బుధవారం బీజేపీ లీడర్లు వనపర్తి లోని కలెక్టరేట్​సమీపంలో వాల్మీకుల దీక్షా శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు.  వెంటనే ప్రభుత్వం స్పందించి వాల్మీకీ బోయల పోరాటాన్ని గుర్తించి ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్​చేశారు. బీజేపీ కార్యవర్గ సభ్యుడు బి. కృష్ణ , నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, గోపాల్​పేట  మండల అధ్యక్షుడు అరవింద్ రెడ్డి,  శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి ఉన్నారు.