సూర్యాపేట, వెలుగు: తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నెల 11న నల్గొండ ఐటీ టవర్లో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. సోమవారం కలెక్టరేట్ లో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఆవిష్కర్తలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుపై సందేహాలను తీర్చేందుకు సంబంధిత నిపుణులతో సలహాలు అందించనున్నట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ కె సీతారామారావు, జడ్పీ సీఈవో శిరీష, ఆర్డీవో వేణు మాధవరావు, సీపీవో కిషన్, సిఎఫ్ వో సతీశ్, ఈడిఎం గఫార్ అహ్మద్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి ప్రణయ్ పాల్గొన్నారు.
