గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో మండలంలోని లచ్యా తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సుధాకర్ పై సీనియర్ అసిస్టెంట్ మొయినుద్దీన్ దాడి చేయడం కలకలం రేపింది. శనివారం సీనియర్ అసిస్టెంట్ బైక్ను అడ్డుకొని తన సర్వీస్ బుక్ ఎంట్రీలను మూడేళ్లుగా ఎందుకు నమోదు చేయలేదని, భవిష్యత్లో తనకు సమస్య వస్తుందని వాపోయాడు.
సీనియర్ అసిస్టెంట్ బదిలీ కావడంతో తనకు ఇబ్బంది కలుగుతుందని, వెంటనే సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయాలని వేడుకున్నాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో సీనియర్ అసిస్టెంట్ కోపంతో తన లంచ్ బాక్స్తో దాడి చేశాడు.
ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ మూడేళ్లుగా సర్వీస్ బుక్లో ఎంట్రీలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయాడు. సర్వీస్ బుక్ ఎంట్రీల కోసం రూ.3 వేలు డిమాండ్ చేశాడని, వేరే వాళ్లు డబ్బులు ఇచ్చారని తనపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించాడు. ఈ ఘటనతో ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
